సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

19, అక్టోబర్ 2009, సోమవారం

'చందమామ'పై చెరగని సంతకం ‘చిత్రా’!


అందమైన 'చందమామ' బొమ్మ. దానికి మరో పేరు.... 'చిత్రా'!

కళ్ళకు కనికట్టు చేసే చిత్ర రేఖా విన్యాసం ఆయన విశిష్టత.

1947 జులై లో వెలువడిన ‘చందమామ’ మొదటి సంచికకు ముఖచిత్రం వేసిందీ, 1955 సెప్టెంబరులో వచ్చిన తొలి బేతాళ కథకు అపురూప చిత్రం సమకూర్చిందీ కూడా చిత్రానే. ఈ ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న విక్రమార్కుడి భంగిమను మార్చి, బేతాళుడి కాళ్ళకు బదులు తల కనపడేలా చేసి మరింత మెరుగుపరిచారు శంకర్.



మనందర్నీ ఇంతగా ఆకట్టుకున్న ఈ బొమ్మ వెనక ఈ ఇద్దరు చిత్రకారులున్నారంటే విశేషమే కదా!

చందమామ ఇంటింటి పత్రికగా పాఠకాదరణ పొందటంలో ప్రధాన పాత్ర జానపద ధారావాహికలది. వాటికి చిత్రా బొమ్మలు ప్రాణం పోశాయి.

అజరామరమైన కళా సృష్టి అది! మొదట్లో వెలువడిన సంచికల్లో దాదాపు ప్రతి కథకూ ఆయనే బొమ్మలు వేసేవారు. మూడు దశాబ్దాల్లో పదివేల చిత్రాలను సృజించారు. ఇంత విస్తృతంగా, అద్భుతంగా వైవిధ్యభరితమైన బొమ్మలను గీసిన చిత్రా ప్రతిభకు తగినంత ప్రాచుర్యం రాలేదు!

ఆయన ఏదైనా కథకు బొమ్మలు గీస్తే... అవి ఆ కథ స్థాయిని పెంచేసి, ఆ కథ నిజమని భ్రమ కలిగిస్తాయి. కథలో వాతావరణాన్ని ఒక్కోసారి రచయిత ఊహల కంటే మిన్నగా కళ్ళముందుకు తెచ్చేసే అపార ప్రజ్ఞ ఆయన సొంతం.

చిత్రా బొమ్మల్లో ఒకనాటి మధ్యతరగతి లోగిళ్ళూ, పేదల పూరి గుడిసెలూ ఏవో పాతకాలం నాటి జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. ప్రశాంతమైన ముని వాటికలూ, రాజ ప్రాసాదాల సంగతి చెప్పేదేముంది? రాజ భవనాల్లో దుస్తుల అలంకరణలూ, కుడ్యాలకు అలంకరించే అందమైన తెరలూ, స్తంభాల నగిషీలూ, నేలకూ, పై కప్పుకూ ముచ్చటైన డిజైన్లూ ... ఆ అతి సూక్ష్మ వివరాలన్నీ అలాగే ఆ బొమ్మలను చూస్తూ ఉండాలనిపించేస్తాయి.

ఒకనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ఆయన బొమ్మల్లో పున: సృష్టిస్తారు. అంతేనా? చీనా జానపదమైనా, గ్రీకు పురాణ గాధ అయినా, బెంగాలీ నందినుల కథలైనా ఆ గీతల్లో అలా ఒదిగిపోవాల్సిందే! ఆయన రేఖల కలయికతో నిర్జనమైన అడవులూ, కలవరపరిచే కడలీ, విశాలమైన మైదానాలూ దృశ్యబద్ధమవుతాయి. అశ్వ పద ఘట్టనా, మద గజ ఘీంకారం, చండ సింహ గర్జనా ఆ చిత్రాల్లోంచి వినిపిస్తాయి.


ఆ వర్ణ చిత్రాలు... కంచుకోటలై కనువిందు చేస్తాయి. జ్వాలా ద్వీపాల్లో, రాకాసి లోయల్లో విచిత్రాకార జీవులై ఆకాశయానంతో అలరిస్తాయి. పాతాళ దుర్గాలైనా, యక్ష పర్వతాలైనా ఆ కుంచె స్పర్శతో రమణీయమై శోభిస్తాయి. ఆ చిత్రాల స్మృతులు శిథిలాలయాలనూ, వాటి ప్రాకారాలనూ దాటేసి, విశాలమైన ప్రకృతిలోకీ, నిసర్గ సౌందర్యం నిండిన అరణ్యాల్లోకీ పరుగులు తీస్తాయి. చిత్ర విచిత్రాలు చేసే ఆ బొమ్మలు మాయా సరోవరాలై ఆహ్లాదపరిచి, తరతరాల చిత్ర కళాభిమానుల జ్ఞాపకాల్లో రాతిరథంలా చెక్కుచెదరకుండా నిలిచివుంటాయి!

రాజ కుమారుల ఆహార్యం అద్భుతంగా ఉండదూ? ముంజేతికి లోహ కంకణాలూ, మెరిసే కత్తి ఒరా, నుదురుపైనా, మెడ వేపూ ఒంపు తిరిగిన శిరోజాలూ, శరీరంపై వేలాడే అంగీ, పాదాలకు అంటిపెట్టుకుని వుండే ‘కుర్తా’, చివరి భాగం సన్నగా వెనక్కి ఒంపు తిరిగి ఉండే పాదరక్షలూ ...

‘అలాంటి డ్రెస్సులు ఇప్పుడు అందరూ ఎందుకు వేసుకోరు? అలా వేసుకుంటే ఎంతో బావుంటుంది కదా!‘ అనే ఊహలు బాల్యంలో ఎవరికైనా వచ్చేస్తాయి. ఆ బొమ్మల ఘనత అలాంటిది!

కదిలే నిశ్చల ‘చిత్రా’లు!

పేరుకు నిశ్చల చిత్రం... కానీ దానిలో అద్భుతమైన కదలిక చిత్రా బొమ్మల ప్రత్యేక లక్షణం. వీలున్న ప్రతి సందర్భంలోనూ పాత్రల కదలికలను చూపించటానికి ఇష్టపడతారని ఆయన బొమ్మలే సాక్ష్యం చెపుతాయి. పోరాట సన్నివేశాల్లో యుద్ధోత్సాహం చిత్రించేటప్పుడు ఆయన కుంచె కదం తొక్కుతుందనిపిస్తుంది!

వీచే గాలిని బొమ్మల్లో చూపించటం కష్టం. కానీ చిత్రా ముద్రతో అది సుసాధ్యమైపోయింది. కొండ మీదో, మైదానంలోనో పాత్రలు నిలబడివుంటే వారి ఉత్తరీయాలూ, దుస్తులూ గాలికి ఎగురుతున్నట్టు గీస్తారాయన.

ఫొటోగ్రఫీలో అభినివేశం ఉండటం వల్ల కాబోలు... విభిన్నమైన కోణంలో బొమ్మను చూపించటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఎంతో ఎత్తు నుంచి కింద దృశ్యాలను చూపించటమో, కింద నుంచి- ఎత్తయిన కోణంలోని దృశ్యాలను వివరాలకు భంగం రానీయకుండా చిత్రించటమో ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది.


చందమామలో విశేష పాఠకాదరణ పొందిన తొలి జానపద ధారావాహిక నెల ‘విచిత్ర కవలలు’. రాజారావు గారు రాసిన ఈ ఏకైక సీరియల్ 1950 జులై- 1951 డిసెంబర్ మధ్య ప్రచురితమైంది. దీనికి నలుపు తెలుపు బొమ్మలను వేసిన చిత్రా ఇదే సీరియల్ 24 ఏళ్ళ తర్వాత (1974 జులై- 1975 డిసెంబర్) తిరిగి ప్రచురించినపుడు వర్ణచిత్ర మాయాజాలం చేశారు. పాతవాటికంటే ఎంతో మెరుగ్గా సరికొత్త బొమ్మలను గీసి పాఠకులను ముగ్ధుల్ని చేశారు.

చందమామకు అట్టవెనక బొమ్మలు కూడా కొన్ని వేశారు చిత్రా. అయితే అవి పెద్దగా ఆకట్టుకోవు! పెయింటింగ్స్ లో కంటే రేఖా చిత్రాల్లోనే ఆయన శైలి ప్రస్ఫుటమవుతుంది.

కథల, సీరియల్స్ టైటిల్స్ ను కథాంశం వ్యక్తమయ్యేలా చిత్రా చక్కగా రాసేవారు. ‘తోకచుక్క’ సీరియల్ కు రాసిన అక్షరాలు తోకచుక్క ఆకారంలోనే కనిపిస్తాయి. చైనా కథల టైటిల్స్ చైనీస్ అక్షరాలను పోలివుండేలా, దయ్యాల కథలకు అక్షరాలు వణుకుతున్నట్టుగా, భలే ఉంటాయి ఆయన లోగోలు!

ఆ అక్షరాల తీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. గుండ్రటి తెలుగు అక్షరాలను పలకలుగా రాసి, వాటి లోపల అందమైన నగిషీలు చెక్కటం చూడొచ్చు.

‘మాయా సరోవరం’ ధారావాహిక, చిత్రా మృతి చెందిన మరుసటి నెలే ముగిసింది. అప్పటికే ఆయన బొమ్మలు గీయటం పూర్తి చేయటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కు ... జయ బొమ్మలు గీశారు. ఆయన బాగానే వేశారు గానీ, చిత్రాతో పోలిస్తే... నిలబడే చిత్రాలు కావు. ఆ రకంగా చిత్రా తోనే సుబ్రహ్మణ్యం గారి ‘ఉజ్వల శకా’నికి తెరపడిందనిపిస్తుంది!

చిత్రా, నేనూ!


1978 మే 6న అస్తమించిన చిత్రా గురించి తర్వాతి నెలలో చందమామలో ప్రచురించినపుడు, నా చిన్నపుడు- చదివాను, బాధ అన్పించింది. కానీ కాలక్రమంలో చిత్రా గొప్పతనం ఎక్కువగా అర్థమయ్యాక ఆయన లోటు మరింతగా తెలిసొస్తోంది.

‘పాతాళ దుర్గం’ ధారావాహికలో ఒక సన్నివేశం ఉంది. చెట్టుకొమ్మల్లో ధూమక సోమకులు దాక్కునివుంటారు. సోమకుడు ఉగ్రసేనుడికి గురిచేసి బాణం ఎక్కుపెట్టిన దృశ్యాన్ని చిత్రా చాలా బాగా గీశారు. అది నాకు బాగా నచ్చేసింది.

ఉండబట్టలేక- తెల్ల చాక్ పీస్ తో ఆ బొమ్మను అనుకరించి గీశాను. ఎక్కడంటే- మా ఇంటి గేటు దాటగానే ఎదురుగా గోడమీద కనిపించే చిన్న బ్లాక్ బోర్డు మీద! గ్యాస్ సిలెండర్ తెచ్చిన ఓ వర్కర్ ఆ బొమ్మను చూసి, ‘ఎవరు వేశారండీ, ఆ బొమ్మను?’ అని అడిగి, ‘చాలా బావుంది, చాలా బావుంది!’ అని ‘నన్ను’ మెచ్చుకున్నాడట. ఆ సమయంలో నేను ఇంటి దగ్గర ఉండివుంటే ‘అది చిత్రా గీసిన బొమ్మ’ అంటూ దాని గురించి ఉత్సాహంగా వర్ణించి చెప్పేవాణ్ణి! బొమ్మలను చూసి, ఆనందించే కళా హృదయం అందరికీ ఉండదు కదా!


చందమామ సంపాదకీయం పేజీలో ఉండే చిత్రా బొమ్మ గుర్తుందా? కొలనులో మెడలను అందంగా వంచేసిన రెండు హంసలూ, పద్మాలూ, నీళ్ళలో ప్రతిబింబించే కొండల నీడలూ, ఆకాశం, మబ్బులూ- ఈ దృశ్యం నన్నెంతో ఆకట్టుకునేది. ఆ బొమ్మ ఎడమవేపు కింది భాగంలో స్వేచ్ఛగా పెట్టిన చిత్రా సంతకం కూడా నాకు ఇష్టమే!

మరణించి 30 ఏళ్ళు గడిచినా చిత్రా స్థానం భర్తీ కాలేదంటే ఆయన ముద్ర ఎంత బలీయమైనదో అర్థమవుతుంది. 66 సంవత్సరాలకే జీవితం చాలించకపోతే మరెన్ని అద్భుత వర్ణచిత్రాలు ఆయన గీసేవారో కదా!

కథల మాంత్రికుడి మాటల్లో.....

చిత్రా గురించి చెప్పుకునేటప్పుడు- జానపద ధారావాహికల స్రష్ట దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోకుండా ఉండలేం. వారిద్దరిదీ అపూర్వ సమ్మేళనం! ‘తోకచుక్క’ నుంచి ‘మాయా సరోవరం’ వరకూ దాసరి- చిత్రాల కాంబినేషన్ ‘చందమామ’ వేదికగా అద్భుతాలు సృష్టించి పాఠకలోకాన్ని ఉర్రూతలూగించింది.

సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో కలిసినప్పుడు చిత్రా గారి గురించి ఆయన్ను చాలా అడిగాను. ఆ విశేషాలు...

చిత్రాతో మీ అనుబంధం...

‘‘ఆర్టిస్ట్ చిత్రాను, నేను 1952 జనవరిలో, చందమామ సంపాదక వర్గంలో చేరిననాడు, చూడడటం జరిగింది. ఆయన 1947లో చందమామ ప్రథమ పత్రిక వెలువడిననాడే, అందులో పనిచేస్తున్నాడు. చిత్రకారుడిగా, ఇలస్ట్రేటర్ గా ఆయన చాలా ప్రతిభావంతుడు.


నేను 1954 జనవరిలో రాయడం ప్రారంభించిన, నా ‘తోకచుక్క’ సీరియల్ కు, ముందుగా చందమామలో (ఒక నెలకు ముందు) ఒక పేజీ రాబోయే కథలోని బొమ్మలను వేసి, దానికి మంచి ఆదరణ (ప్రారంభంలోనే) కలిగేట్టు చేశాడు.


తర్వాత నే రాసిన ‘మకర దేవత’, ‘ముగ్గురు మాంత్రికులు’, ‘కంచుకోట’ ... అలా మరికొన్నిటికి చిత్రాలు వేశారు.

ఆయనది చాలా అకాల మరణం. ఆయనతో నా అనుబంధం- కేవలం రచయితా, చిత్రకారులుగానే కాక, చాలా స్నేహ, పరస్పర గౌరవాదరాలతో కూడినది.

చిత్రా స్వగ్రామం, ఇప్పటి ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్ళూరు దగ్గిర చిన్న గ్రామం అని కొద్దిగా గుర్తు. ఆయన చందమామలో చేరిన - తర్వాతి ఆర్టిస్టుల్లా కాక, తెలుగు రాయా చదవా ఎరిగినవాడు.’’

చిత్రా బొమ్మల ప్రత్యేకత, ఆయన శైలి....

‘‘ఆయన బొమ్మల ప్రత్యేకత... బొమ్మల్లో, ఆయా వాతావరణానికి (Background) తగిన రీతిలో వాస్తవంగా కదులుతున్నట్టు ఉండేవి. ఇంక శైలి మాటకొస్తే, ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్నదని నేననుకోను.

ఆనాటీ, ఈనాటీ ఆర్టిస్టుల్లో ఆయన సమర్థుల్లో అత్యంత సమర్థుడు.’’

జానపద సీరియల్స్ పాత్రల చిత్రకల్పన విషయంలో మీ ఇద్దరూ చర్చించుకునేవారా?‘‘నేను రాసిన జానపద సీరియల్స్ మొత్తం జనవరి 1954 నుంచి 1978 వరకూ పన్నెండు. వాటిని గురించిన చర్చ (పాత్ర- చిత్రకల్పన) వగైరా చిత్రా గారి తోనే కాదు, ఆ తర్వాత చిత్రాలు వేసిన జయ గారితో కూడా చర్చించడం జరగలేదు. అంత అవసరం అనుకుంటే పాత్రల వేషధారణలో కొన్ని మార్పులు చెప్పేవాడిని.’’

యక్షపర్వతం, రాతిరథం సీరియల్స్ కథానాయకులు ఖడ్గ వర్మ, జీవ దత్తుల పాత్రల ఆహార్యం మీరు ఊహించినట్టే వచ్చిందా? అంతకంటే బాగా వచ్చిందా?

‘‘మీరు ఉదాహరించిన పాత్రలే కాదు, తర్వాత రాసిన సీరియల్స్ లోని పాత్రలూ, నా ఆలోచనకు పూర్తి అనుగుణంగా వచ్చినవి. ఇప్పుడు (2009లో ప్రచురణ జరుగుతున్న) ‘పాతాళ దుర్గం’ బొమ్మలతో పాటు లోగడ ఆయన చిత్రించిన సీరియల్ బొమ్మలు, ఈ నాటికీ... ఇన్నేళ్ళ తర్వాత కూడా అద్భుతం అనుకుంటున్నాను.’’

రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాల్లో...
చందమామను అనితర సాధ్యంగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన లెజెండ్ కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన కుమారుడు రోహిణీ ప్రసాద్ గారు 2006 జనవరిలో ఈ మాట లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు ’ విలువైన సమాచారంతో ఉన్న వ్యాసం. దీనిలో చిత్రా గారి ప్రస్తావన ఇలా ఉంటుంది-

‘‘ చిత్రాగారు చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశారు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఎప్పుడూ నీట్‌గా డ్రస్‌ చేసుకుని వచ్చేవారు. మితభాషి. అస్తమానం ఇన్‌హేలర్‌ ఎగబీలుస్తూ ఉండేవాడు.

చిన్నప్పుడు నాకు బొమ్మలు గీసే అలవాటుండడంతో ఆయన పక్కన గంటల తరబడి కూర్చుని చూసేవాణ్ణి. ముందుగా పెన్సిల్‌ స్కెచ్‌ గీసుకుని, ఆ తరవాత ఇండియన్‌ ఇంక్‌తో ఆయన బొమ్మలు వేసేవారు. ఒక సందర్భంలో బాపూ చిత్రాగారి బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం గీసే ఆయన పద్ధతి తనకు నచ్చుతుందనీ మాతో అన్నారు.

అమెరికన్‌ కామిక్స్‌ “చందమామ” ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవారు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు.

దాసరి వారి సీరియల్‌కు చిత్రాగారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యంగారు “మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు” మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవారు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా గారి బొమ్మల వల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.

శంకర్‌ ఆర్టు స్కూల్‌కు వెళ్ళిన మనిషి. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత.

మొత్తం మీద వీరిద్దరూ డిటెయిల్స్‌తో కథలకు బొమ్మలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు. “చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి.’’

ఈ టపాలో మొదట ఇచ్చిన చిత్రం ‘జ్వాలా దీపం’ధారావాహికకు చిత్రా కుంచె చిత్రించిన బీభత్స దృశ్యం.

ఇప్పుడు 'తోకచుక్క','మాయా సరోవరం' సీరియల్స్ లోని రెండు అద్బుత చిత్రాలు చూడండి!




















చిత్రా గురించి ఇటీవల శివరామప్రసాద్ గారూ, రాజశేఖర రాజుగారూ తమ బ్లాగుల్లో రాశారు. వాటి లింకులు ఇస్తున్నాను.

‘సాహిత్య అభిమాని’ బ్లాగు టపా.

‘చందమామ చరిత్ర’ బ్లాగు టపా.





16 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
SRRao చెప్పారు...

ఎంతో ఓపికగా, మరెంతో వివరంగా చిత్రా గారి వివరాలతో బాటు చందమామ వివరాలు, బొమ్మలు కూడా అందించినందుకు కృతఙ్ఞతలు. ఆంధ్రులకు అందిన అపూర్వమైన చందమామ.

వేణు చెప్పారు...

@ సుజాత: ధన్యవాదాలండీ!

నాకు చందమామపై అభిమానం ఇంతగా ఉండటానికి చాలావరకూ చిత్రా బొమ్మలే కారణం. ఆయన బొమ్మల వైవిధ్యం ప్రదర్శించాలంటే... ఒక టపాలో సాధ్యం కాదు. మంచి చిత్రకారులుగా తయారవ్వాలనుకునేవారికి ఆయన బొమ్మలు చక్కని నమూనాలు. వీటిని ప్రాక్టీస్ చేస్తే చాలా మెలకువలు వచ్చేస్తాయి.

ఇక- నేను గీసిన బొమ్మల సంగతా? :)


@ SRRao: మీ వ్యాఖ్యకు చాలా థాంక్సండీ!

Anil Dasari చెప్పారు...

>> "చివరి భాగం సన్నగా వెనక్కి ఒంపు తిరిగి ఉండే పాదరక్షలూ ..."

అలాంటి పాదరక్షల కోసం ఏడెనిమిదేళ్ల వయసులో నేను ఒకటే గొడవ చెయ్యటం ఇప్పటికీ బాగా గుర్తు. చాలా చిన్నప్పటి అనుభూతులు, అనుభవాలు, చందమామతో అనుబంధం తట్టిలేపారు మీ విలువైన టపాతో.

చిత్రా పూర్తి/అసలు పేరు తెలిస్తే ఇవ్వాల్సింది.

వేణు చెప్పారు...

@ అబ్రకదబ్ర : ‘చందమామ’ అంటే చిన్నప్పటి అనుభూతులూ, అనుభవాలే కదా మరి! చిత్రా గారి అసలు పేరు టి.వి.రాఘవులు. నేనిచ్చిన లింకుల్లో ఉంది కదా అని, ప్రత్యేకంగా ఈ పేరును నేను ప్రస్తావించలేదు! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

ఒక బొమ్మ చూసినప్పుడు చిత్రకారుడి సంతకాన్ని గమనించడం అన్నది నాకు 'చిత్రా' తోనే మొదలు.. తర్వాత వపా.. చిత్రా విశేషాలు చాలా బాగున్నాయండీ.. నిజానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, మీరు ఏం రాస్తారా? అని.. వీలుంటే వపా గురించి కూడా నాలుగు మాటలు............ ఎదురు చూడొచ్చు కదండీ??

వేణు చెప్పారు...

థాంక్యూ మురళీ! అలవోకగా రాసినట్టుండే చిత్రా సంతకం నాకు ఇష్టం. అప్పుడప్పుడూ ఆయన తన సంతకాన్ని నిలువుగా ఒక అక్షరం కింద మరో అక్షరం రాసేవారు.

వ.పా. గురించి కాదు గానీ మరో గొప్ప చిత్రకారుడి గురించి రాయాలని నాకుంది! (ఇంకెవరూ, శంకర్ గురించి... అనుకుంటున్నారా? కాదులెండి :))

kanthisena చెప్పారు...

వేణూ గారూ,
చాలా పొరపాటు జరిగిపోయింది. చందమామ కలెక్టర్ ఎడిషన్‌ను తెలుగులో ప్రచురించే పనుల్లో ఉండి గత వారం రోజులపైగా అనువాదాల ఒత్తిడిలో ఉండి ఇంటర్నెట్ చాలా తక్కువగా చూడటం. మధ్యలో ఓ మూడురోజులు తప్పనిసరై తిరుపతి, కడపలకు వెళ్లవలసిరావడంతో మీ హృదయంలోంచి వచ్చిన ఈ అపరూప కథనం చూడటం కుదరలేదు.

ఇవ్వాళ కూడా ఎందుకో మీ బ్లాగును రెఫర్ చేయాలనిపించి తెరిచి చూస్తే మహాద్భుత దృశ్యం ఇదిగో ఇలా కళ్లముందు సాక్షాత్కరించింది. రెండు రోజులు కూడలి, జల్లెడ, హారం కేసి చూడలేకపోయినా, చందమామ అభిమానుల బ్లాగులు తెరువలేకపోయినా ఎంత ప్రమాదం జరుగుతుందో ఇప్పటికి ఏ నాలుగోసారో, అయిదో సారో నా అనుభవంలోకి వచ్చింది. అందులో తాజాగా మీది.

అందుకే కనీసం చందమామ అభిమానులు అయినా తాము కొత్తగా ఏదైనా రాసినప్పుడు ప్రత్యేకించి చందమామ గురించి, దాని చిత్రకారుల గురించి కథనం రాసిన పక్షంలో ఆ విషయాన్ని ఊరికే పోస్ట్ చేసి ఊరుకుండటం కాకుండా మనందరి ఈమెయిళ్లు కాస్త ఒపికగా సేకరించి అందరికీ బల్క్‌మెయిల్ రూపంలో మన కొత్త లింకులను పరస్పరం పంపగలిగితే ఎంత బాగుంటుందని గతంలోనే నేను రెండు మూడు సార్లు మొత్తుకున్నాను కూడా.

ఎందుకంటే అగ్రిగేటర్ సైట్లలో మన కథనాలు ఉంచినా, తాజాగా మంచి కథనాలు పోస్ట్ చేసినా సరే్ ఒక్కోసారి కాదు చాలాసార్లు అనివార్యంగా వాటిని సకాలంలో చూడలేని ఘటనలు నా అనుభవంలో చాలా సార్లు వచ్చాయి. ఇకనైనా మనం ఇలాంటి సందర్భాల్లో స్వయంగా మన రచనల పరస్పర పంపకం చేస్తేనే బాగుంటుందని బలంగా భావిస్తున్నా..

పరిమిత వనరులతో అయినా సరే చిత్రాగారి బొమ్మల గురించి ఇంత చక్కటి కథనం ప్రచురించారు. ఇదే మీరు చందమామ ఆఫీసుకు వచ్చి చిత్రా, ఎంటీవీ ఆచార్య, శంకర్, వపా గార్ల చిత్రాలు భారీ సైజులో చూడగలిగితే మీరు, శివరాం ప్రసాద్ గారు వంటి వారు ఎంత చక్కటి ప్రేరణ పొంది ఉండేవారో మాటల్లో చెప్పలేను.

కాని ఒక్కటి మాత్రం చెప్పగలను. దాసరి సుబ్రహ్మణ్యం, చిత్రా గార్ల గురించి మీరు చేసిన కృషి చందమామ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ఇదే విధమైన క్వాలిటీ రైటింగ్‌ను మీరు, శివరాం గారు, తదితరులు కొనసాగించగలరని ప్రగాఢంగా ఆశిస్తున్నాను.

దీని కొనసాగింపుగా చిత్రా, శంకర్ గార్లపై నేను పొందుపర్చిన వార్తా విశేషాల సమాచారం ఓ పెద్ద కథనంలాగా తయారవడంతో దాన్ని మీ బ్లాగులో కామెంట్ రూపంలో పెట్టడం బాగుండదనే ఉద్దేశంతో ఈ మొత్తం కథనాన్ని నా చందమామ చరిత్ర బ్లాగులో పోస్ట్ చేయాలనుకుంటున్నాను.

వేణు చెప్పారు...

రాజశేఖర రాజు గారూ,

అద్భుత చిత్రకారుడు ‘చిత్రా’పై నేను రాసిన టపా గురించి మీ స్పందన నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. థాంక్యూ!

విస్తృత ప్రాచుర్యం పొందాల్సిన చిత్రా కొంతమంది స్మృతుల్లో మాత్రమే ఉంటూ- ఒక రకంగా విస్మృత కళాకారుడిగా ఉన్నారనే బాధ నాకుంది. ఆయన బొమ్మలపై నా అభిమానాన్నంతా కలబోసి ఈ టపాగా మలిచాను !

ఇక మరో గొప్ప చిత్రకారుడు ఎంటీవీ ఆచార్య గారి గురించి నా బ్లాగులో రాయాలనేది నా సంకల్పం.

Saahitya Abhimaani చెప్పారు...

చాలా బాగా వ్రాశారు వేణుగారూ. చిత్రాగారి నైపుణ్యాన్ని ఎత్తి చూపించటానికి మీరు ఎన్నుకున్న బొమ్మలు చాలా విలక్షణంగా ఉండి బాగున్నాయి. మీరు వ్రాసిన పధ్ధతికూడ చక్కగా ఉన్నది. బాగా వ్రాస్తున్నాము మనం అనుకునే వారికి కూడ, బాగా వ్రాయటం అంటే ఇది అనిపించేట్టుగా వ్రాశారు. ఆభినందనలు.

మీరు చిత్రా గారి గురించి వ్రాసినది, నేను మునుపు వ్రాసినది, మన రాజుగారి వ్యాసం అన్ని కలగలిపి, మీ చక్కటి సంపాదకీయ ప్రతిభ చూపించి, ఈనాడు ఆదివారం అనుబంధంలో వెయ్యండి , చిత్రాగారి గురించి ఆంద్ర దేశం అంతటా, తెలుగు మాట్లాడుకునే వారందరికి తెలియ చెప్పినట్టవుతుంది.

వేణు చెప్పారు...

శివ గారూ,

'చిత్రా’ టపాపై మీ అభినందనలకు ధన్యవాదాలు. చిత్రా వేసిన మరికొన్ని బొమ్మలు కూడా ఇవ్వాలని సిద్ధం చేశాను గానీ, మరీ ఎక్కువైపోతాయనిపించింది.

నేను రాసిన పద్ధతి బావుందంటారా? చిత్రాపై నాకున్న అవ్యాజమైన అభిమానమే అలా రాసేలా చేసిందనుకుంటాను.

ఆదివారం అనుబంధంలో ప్రచురణ- మంచి ఆలోచన. అలా వస్తే నిజంగానే ఎక్కువమంది చదివే అవకాశం ఉంటుంది. లెటజ్ హోప్ సో!

murthy చెప్పారు...

వేణు గారు,
మీరు చిత్ర గురించి, చందమామ కథల గురించి నాకు తెలుసుకోవాలనుకున్న సమాచారాన్ని ఎంతో ఇచ్చారు. ఇది చూసాక నా బ్లాగు లో నా చిన్ననాటి పత్రికల పై నేను మొన్న రాసిన టపా తేలిపోయినట్లన్పించింది. మీరు రాసిన చక్కటి టపాలకు అభినందనలు. చిత్ర గారు, వైజాగ్ లో ఉండేవారని మా నాన్న గారు చెప్పేవారు. నిజమేనా..?
రామకృష్ణ

వేణు చెప్పారు...

రామకృష్ణ గారూ,
ధన్యవాదాలండీ. ఆర్టిస్టు చిత్రా వైజాగ్ లో ఉండేవారనేది నాకు కొత్త విషయమే! నిజమో కాదో ధ్రువీకరించుకోవాలి.

kanthisena చెప్పారు...

ఆర్టిస్టు చిత్రాగారు విశాఖపట్నంలో ఉండేవారా.. ఇది కొత్త విషయమే.. అయితే మద్రాసులో స్కూల్లో చదువు పూర్తయ్యాక మౌంట్‌రోడ్ లోని ఆక్స్‌ఫర్డ్ ప్రెస్ వంటి చోట్ల పనిచేశాక 1947లో చందమామలో చేరింది మొదలు చిత్రాగారు కన్నుమూసేవరకు చెన్నయ్‌లోనే ఉండేవారు. ట్రిప్లికేన్‌లో అద్దె ఇంట్లో దాదాపు 30 సంవత్సరాలకు పైగా ఆయన కుటుంబంతో కలిసి ఉండేవారు. చిత్రాగారి ఫ్యామిలీ ప్రెండ్‌గా ఉన్న చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారు ఈ వివరాలు చెప్పారు. పైగా చిత్రాగారి స్వస్థలం చెన్నయ్‌కి నలభై కిలోమీటర్ల దూరంలోని తిరువళ్లూరు. ఇక్కడి వీర రాఘవ ఆలయం సుప్రసిద్ధమైంది కావటంతో తల్లి తండ్రులు ఈయనకు టీ.వీ రాఘవులు అని పేరు పెట్టారు. మూర్తిగారు ఈయన వైజాగ్‌లో ఉండేవారని చెప్పడం ఆసక్తికరంగానే ఉంది.అయితే చిత్రాగారు సమయం దొరికితే చాలు విహార స్థలాల సందర్శనకు వెళ్లేవారు కనుక ఆలాంటి సందర్భాల్లో ఒకటి రెండు సార్లు విశాఖకు కూడా పోయి వచ్చేవారేమో.. తెలీదు. శంకర్ గారు, చిత్రాగారు తిరుపతి సమీపంలోని చంద్రగిరి కోటను కూడా 50ల చివర్లో సందర్సించి అరుదైన పోటోలు తీశారు. ఇలా విహరార్థం చిత్రాగారు విశాఖ వచ్చి ఉంటారనుకుంటాను.

Unknown చెప్పారు...

Needless to say I am a great fan of Chitra. Not only his artwork in serial were great, every frame he sketched was superb and always had the 3 dimensional effect. I rate his "Duregesha Nandini" cover art to be the best ever by anyone.

Recently I was very happy to note that 1947 July Chandamama has cover to cover art work by Chitra. Every artwork in every page sthis has been done by Chitra !!!

రసజ్ఞ చెప్పారు...

వ్రాసిన ఇన్ని రోజులకా అనుకోకండే! ఇప్పుడే మొత్తం చదివాను! చాలా ఆసక్తికరంగా,వివరణాత్మకంగా, నాకెంతో ఇష్టమయిన చందమామ బొమ్మలతో చాలా బాగుంది! అసలు మన తెలుగు వాళ్ళల్లో చందమామ అంటే తెలియని వారుండరేమో! ఎన్నో క్రొత్త విషయాలు తెలిసాయి ధన్యవాదాలు!