జయప్రకాశ్ నారాయణ అంటే మీకు నచ్చకపోవచ్చు. ‘లోక్ సత్తా’ పార్టీ అంటే- మాస్ మసాలా సినిమాల వెల్లువలో ఎవరికీ పెద్దగా పట్టని ‘ఆర్ట్ ఫిల్మ్’ అనిపించొచ్చు. ఆ పార్టీ రాజ్యాంగ బద్ధంగా ప్రతిపాదించిన ‘జిల్లా ప్రభుత్వాల’ ఏర్పాటు మీకైనా, నాకైనా అసలు రుచించకే పోవచ్చు!
కానీ ప్రస్తుత సంక్షుభిత రాజకీయ, సామాజిక వాతావరణంలో, ఈ నిరాశా తిమిరంలో జయప్రకాశ్ నారాయణ (జేపీ) వైఖరి నాకు గోరంత దీపంలా తోస్తోంది.
ద్వేష భాషకు ప్రాంతం తేడా లేదు. విద్వేష భావనకు విచక్షణతో పనిలేదు.
అందుకే కదా, ఇతర ప్రాంతాల వారిని వ్యతిరేకించటమే ‘సొంత’ ప్రాంతాభిమానంగా చెలామణీ అవుతోంది! అసహనం, క్రోధం... ఎవరికైనా ప్రమాదకరమని హితవు చెప్పేవారు అరుదైపోతున్నారుగా?
విధ్వంసమే సాహసంగా,
ఉన్మాదం వీరాభిమానంగా,
ద్వేష తీవ్రత... తీవ్ర భావోద్వేగంగా - చలామణీ అయిపోతోందిగా?
ఉత్సాహానికి ‘డౌన్ డౌన్’ నినాదాలు ప్రతీకలవుతున్నాయి. తగలబడుతున్న భవనాలు,
తగలబెడుతున్న దిష్టిబొమ్మలు, ధ్వంసమవుతున్న కార్యాలయాల దృశ్యాలు టీవీల తెరలంతా ఆక్రమించేస్తున్నాయి.
బంద్ లూ, రాస్తారోకోలూ , రైల్ లోకోల మూలంగా సామాన్య ప్రజలు నలిగిపోవటం అందరికీ అనుభవమే కదా? విద్యార్థుల చదువులు అటకెక్కటం చూస్తూనే ఉన్నాం.
ఆవేశాగ్నులు రగిల్చే ‘నాయకులకు’ కొదువ లేకుండా పోతోంది.
ఇలాంటి గందరగోళంలో విజ్ఞతాయుతమైన గొంతు... సామరస్య స్వరం వినిపిస్తే అదెంత ఊరటగా ఉంటుంది?
జేపీ చేసింది అదే!
ఉద్రేకపూరిత వాతావరణం చల్లారాలని ఆకాంక్షిస్తూ ‘సామరస్య పరిష్కారం’ కోసం ప్రయత్నం చేసిన నాయకులు జేపీ తప్ప ఇంకెవరైనా ఉన్నారా? ( ఆయన ప్రయత్నం ఫలితమిస్తుందా లేదా అనేది తర్వాతి సంగతి. )
ఢిల్లీలో మూడు రోజులపాటు కేంద్రంలోని ముఖ్య నాయకులతో, రాజకీయ పార్టీల పెద్దలతో సంభాషణలు జరపటంలో ‘గొప్ప’ ఏమీ లేకపోవచ్చు.
కానీ ‘ఒక పౌరుడిగా బాధ్యత తీసుకుని’ ఈ ప్రయత్నం చేసినందుకు జేపీని అభినందించవద్దా?
ఎంతసేపూ- ఈ వివాదంలో ప్రజల భావోద్వేగాల నుంచి రాజకీయ ప్రయోజనాలు సాధిద్దామనే సంకుచిత దృష్టి పెరగటమే తప్ప ... ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నాశనమవుతోందని ఆలోచించేవారే అరుదైపోతున్నారు!
..... ఇలాంటి పరిస్థితుల్లో జేపీ చర్య ఆశా కిరణంలా భాసిస్తోంది!
.........
ప్రస్తుత వివాదానికి సంబంధించి జయప్రకాశ్ నారాయణ భావాలను ఇక్కడ ఇస్తున్నాను. (ఆలోచించండి.. ఇవి నచ్చినా, నచ్చకపోయినా సరే!).
* తాజా సంక్షోభం రాజకీయ దివాళాకోరు తనానికి ప్రబల నిదర్శనం. ఇది తెలుగు ప్రజల భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం.
* ప్రధాన పార్టీలు ముందొక మాట చెప్పటం... తర్వాత అవసరం తీరగానే ఆ మాట తప్పడం, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం... వీటి పర్యవసానమే రాష్ట్రంలోని నేటి సంక్షోభం!
* పార్టీల హద్దులు చెరిగిపోయాయి. ప్రతి పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని నాయకులే చెబుతున్నారు. సిద్ధాంతాల ఊసే లేదు.
* (మన నేతలు) తాత్కాలిక ప్రయోజనాల కోసం విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారు.
* ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరగవు. రాష్ట్రం విడిపోతే కొంపలు మునిగిపోవు. తెలంగాణా ఇచ్చినా ఒక్కటే; సమైక్యాంధ్రగా ఉన్నా ఒక్కటే. రేపు తెలంగాణా ఇస్తే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో ఒక గీత మాత్రమే ఏర్పడుతుంది. అంతకంటే ఎక్కువగా దీన్ని సీరియస్ గా తీసుకోనక్కర్లేదు.
* ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ లోగా మూడు దశల్లో మధ్యంతర ఏర్పాట్లు చేపట్టాలి.
* ప్రజలు ఉద్వేగాలకు లోనుకాకుండా తమ భావాలను శాంతియుతంగా, ప్రజాస్వామికంగా వ్యక్తం చేయాలి. అప్పుడే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వీలవుతుంది!
* * *
‘మోహన’ గారి ‘విశాల ప్రపంచం’ బ్లాగులో జయప్రకాశ్ నారాయణ గారితో టీవీ 9 ఇంటర్ వ్యూ
భాగాలున్నాయి; ఇక్కడ చూడండి!
21, డిసెంబర్ 2009, సోమవారం
15, డిసెంబర్ 2009, మంగళవారం
తెలంగాణాపై రంగనాయకమ్మ గారి భావాలు!
సున్నితమైన ప్రాంతీయ భావోద్వేగాలు తెలుగు నేలను ఊపేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో విచక్షణ, సంయమనం, చర్చ ఎంతో అవసరం.
రచయిత్రి రంగనాయకమ్మ గారు ‘తెలంగాణది ప్రత్యేక పరిస్థితి!’ అంటూ ఓ వ్యాసం రాశారు. ఇవాళ (మంగళవారం) ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిందిది.
ఈ పత్రిక చూడని, చదివే అవకాశం లేని పాఠకుల కోసం దీన్ని ఈ బ్లాగులో ఇస్తున్నాను.
‘నిరాహార దీక్ష ఒక తెలంగాణా వీరుడు చేస్తే, ఒక ఆంధ్రా వీరుడు మాత్రం చేయలేడా?’ , ‘కుర్రాళ్ళలో ఆత్మహత్యల పిచ్చి చూసి అదంతా ఉద్యమ చైతన్యం అని ముచ్చట పడకండి!’ అంటూ సాగే ఆమె వాదన చూడండి.
‘తెలంగాణాకు హైదరాబాద్ ఇవ్వటం’ లాంటి కొన్ని విషయాలను ఆంధ్రా కోణంలో కూడా చర్చించాల్సిందని ఈ వ్యాసం చదివిన కొందరు చెప్పారని ... రంగనాయకమ్మ గారు అన్నారు.
‘నిజమే. కానీ ఒకే వ్యాసంలో అన్ని విషయాలూ చర్చించటం సాధ్యం కాదు కదా!’ అన్నారామె.
దీంతోపాటు ఇటీవలే ఆంధ్రప్రభలో రంగనాయకమ్మ గారు రాసిన చిన్న వ్యాసం కూడా ఇస్తున్నాను.
ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చదివి చూడండి ఓసారి !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)