అంతేనా? ఆ ఇద్దరికీ తెలుగు కథలంటే బాగా ఇష్టం.
అందుకే ‘ఒక్క కథ! ఒక్కటంటే ఒక్కటి అచ్చయితే బాగుణ్ణు’ అని తపించేవారు!
ఇదంతా 35 ఏళ్ళ కిందటి ముచ్చట. కాలం గిర్రున తిరిగింది. కథకులవ్వాలని అంతగా కోరుకున్న ఆ మిత్రుల ఆశలు ఫలించాయా?
ఆ ఇద్దరిలో ఒకరు వంశీ!
వెండితెర దర్శకుడిగా వెలిగినా సాహిత్యం లోనే ఉంది ఆయన ఆత్మ. అనుభవాలనూ జ్ఞాపకాలనూ అతి సూక్ష్మ వివరాలు కూడా వదిలిపెట్టకుండా అందమైన కథలుగా చెక్కటంలో ఆరితేరారు. యాభై కథలకు పైగా రాశారు.
మరొకరు ఎ.ఎన్. జగన్నాథశర్మ. పాత్రికేయునిగా, సినీ టీవీ రచయితగా ప్రసిద్ధులయ్యారు. ఐదు వందల కథలు రాశారు.
ఈ మధ్యనే ఆయన తొలి కథా సంకలనం ‘పేగు కాలిన వాసన’ విడుదలైంది. పేదరికం, దిగువ మధ్యతరగతి ప్రజల వ్యథలను ఇతివృత్తాలుగా తీసుకుని, చక్కటి కథలుగా మలిచారు. వాటిలో చాలా కథలు నాకు నచ్చాయి.
నిప్పుబొమ్మ, గాజుపెంకులు, ఎర్రనీళ్ళ వాన, చేతులు తెగిన హృదయం, తెగిపడిన పావురం రెక్క- ఇలా.. శీర్షికలూ విలక్షణమే!
‘గోదావరి మీద ఎండ తీక్షణంగా ఉంది. గాజుకెరటాలతో ఎండ మెరుస్తోంది’.. ఇలాంటి వర్ణనలు సంకలనం నిండా బోలెడు. కథలను పఠనీయం చేయటంలో వాటి పాత్ర కూడా ఉంది!
కథా సంకలనానికి ఏ పేరు పెట్టాలనేది రచయిత ఇష్టానికి సంబంధించింది. ‘పేగు కాలిన వాసన’ అనేది కథకు శీర్షికగా సముచితమే. కానీ పుస్తకానికి ఈ పేరు కాకుండా మరే కథ పేరైనా పేరు పెట్టివుంటే బావుండేదనిపించింది. (అసలు కథా సంకలనాలకు పుస్తకంలో ఉన్న ఏదో ఒక కథ పేరు పెట్టెయ్యటం మాత్రం ఏం సమంజసం?)
ఈ పుస్తకం గురించి ‘ఈనాడు ఆదివారం’ మ్యాగజీన్ లో రాసిన క్లుప్త సమీక్షను ఇక్కడ ఇస్తున్నాను.