సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, జనవరి 2011, సోమవారం

‘చందమామ’ను దాటి ‘బొమ్మరిల్లు’ను మీటి...!

‘ఇండియా టుడే’ పత్రిక ఆయన్ని ‘జానపద కథా వైశంపాయను’డని కీర్తించింది!

అపూర్వమూ, మౌలికమూ అయిన జానపద కథల స్వర్గాన్ని సృష్టించినందుకు ‘విశ్వామిత్రు’డితోనూ పోల్చొచ్చు. జానపద కథా సరిత్సాగరాన్ని ‘అగస్త్యు’డిలా ఆపోశన పట్టాడంటూ అభివర్ణించవచ్చేమో కానీ, అద్భుతమైన రచనలు చేసి కూడా ఆయన తెరమరుగునే ఉండిపోయారు ... ‘అగస్త్య భ్రాత’లా!

బతికుండగా ఆ పేరు పాఠకులకు పెద్దగా తెలియలేదు. చనిపోయాకే ఆయన రచనల విస్తృతి పాఠక లోకానికి వెల్లడవుతోంది...

ఔను... ఇదంతా ‘జానపద నవలా సమ్రాట్’ దాసరి సుబ్రహ్మణ్యం గారి సంగతే!
అన్వర్, చంద్రల గీతల్లో దా.సు.గారు

ఆ అక్షరాల వెలుగులు ‘చందమామ’ పత్రికకు మాత్రమే పరిమితం కాలేదు.  ఆ కలం ఇంద్రజాలం ఇతర పత్రికల పాఠకులనూ విశేషంగా సమ్మోహనపరిచింది. బొమ్మరిల్లు, ప్రమోద, జాబిల్లి, స్నేహబాల, మిలియన్ జోక్స్... ఈ పత్రికల్లో వెలువడిన జానపద ధారావాహికల స్రష్ట కూడా ఆయనే!

‘చందమామ’లో దా.సు. సృష్టించిన ‘తోకచుక్క’ నుంచి ‘భల్లూక మాంత్రికుడు’ వరకూ పన్నెండు సీరియల్స్ గురించి ఇప్పుడు చాలామందికి తెలుసు.

తెలియనిదల్లా పేరు లేకుండా ఇతర పత్రికల్లో ఆయన రాసిన వాటి గురించే!

అసలే అజ్ఞాత రచయిత... పైగా ప్రచ్ఛన్న రచనలు! ఒక్కో రహస్యమే బయటపడుతూ ఆ రచనా విశ్వరూపం... ఇప్పుడు - క్రమంగా గోచరమవుతోంది!

ఇదంతా ఇప్పటికైనా వెల్లడవుతున్నందుకు సంతోషం. కానీ... జీవించివుండగా ఆయన కృషి సంపూర్ణంగా పాఠకులందరికీ తెలియకుండా పోయిందే అనే బాధ!


*******

‘దాచేసిన’ దాగని సత్యం!

అసలు జనవరి 2011 ‘రచన’ విడుదలయ్యేవరకూ దాసరి సుబ్రహ్మణ్యం గారి రచనల విస్తృతి (నాతో సహా) పాఠకులకెవరికీ తెలీదు.

దా.సు. గారు ఏళ్ళ తరబడి గుండెల్లో దాచేసుకున్న తన రచనల రహస్యాలన్నీ దాసరి వెంకటరమణ గారికి స్వయంగా చెప్పారు. ఆయన ఇన్నాళ్ళూ వాటిని గుట్టుగానే ఉంచి, చివరకు ‘రచన’ జనవరి సంచికలో ‘ఈయన సామాన్యుడు కాదు!’ వ్యాసం ద్వారా పాఠకలోకం ముందు పెట్టారు.

( ఆ వ్యాసంలో కొంత భాగం ఇది...)

దా.సు. గారి రచనలను ఓసారి చూడండి-

బొమ్మరిల్లులో-   మృత్యులోయ (1971-74); శిథిల నగరం (74-75); మంత్రాల దీవి (76-80); గంధర్వ నగరం; సర్ప కన్య (80)


‘స్నేహబాల’లో-  మాయా గంధర్వుడు (1977)

‘ప్రమోద’లో-  కపాల దుర్గం (1978)

‘మిలియన్ జోక్స్’లో-  మాయా ద్వీపం (1980)

వీటిలో ఏమైనా నవలలు మీరు చదివారా?

... జాబితా ఇంకా అయిపోలేదు!

జంతువుల పాత్రలతో కథల సీరియల్స్ కూడా దాసరి సృష్టే.


చందమామలో... నక్క సవారీ, రాజప్రతినిధులు;

బొమ్మరిల్లులో.... కుందేలల్లుడు కథలు, ఖరభ శరభ కథలు;

ప్రమోదలో... అదురూ బెదురూ కథలు;

జాబిల్లిలో... రుద్రాభద్రుల కథలు;

మిలియన్ జోక్స్ లో... కేతక చాతకుల కథలు...

ఇవన్నీ!

ఇవే కాదు...

బొమ్మరిల్లు పాకెట్ సైజు పుస్తకాల్లో ‘రచయిత పేరు’ లేకపోతే అవి దాసరి సుబ్రహ్మణ్యం గారివే అయివుండటానికి ఆస్కారం ఉంది. ఆ పుస్తకాలు దొరికితే (పాత పుస్తకాల షాపులే శరణ్యం!) రచనా శైలిని బట్టి నిగ్గు తేల్చే ప్రయత్నం చేయవచ్చు. ఆ పుస్తకాల కోసం సాగుతున్న అన్వేషణలో మీరూ ఓ చేయి వేయవచ్చు.


అంటే... తెలుగులో బాలల పత్రికల ద్వారా జానపద కథా సాహిత్య సృష్టినంతా దాదాపు ఆయనొక్కరే... ‘ఏక వ్యక్తి సేన’లాగా నిర్వహించారన్నమాట... అనుపమానంగా, అనితర సాధ్యంగా!

అయినా...

ఏ పటాటోపమూ లేకుండా...


కీర్తి ప్రతిష్ఠలేమీ ఆశించకుండా ... నిష్కామంగా...


అనామకంగా...!


*******

‘పొరపాటు’న సరైన వ్యక్తినే అడిగా!

‘బొమ్మరిల్లు’లో వచ్చిన ‘మృత్యులోయ’ను దాసరి గారే రాశారని హైదరాబాద్ లో జరిగిన ఆయన సంస్మరణ సభలో తెలిసింది. ఆశ్చర్యానందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాను!


నాకెంతో ఇష్టమైన నవల అది. అసలు ‘మృత్యులోయ’ అన్నపేరులోనే ఏదో వణికించే భీతి! ఆ లోయలో పడిపోయిన కథానాయకుల గురించి నా బాల్యంలో ఎంతో బెంగపడ్డాను. ఉత్కంఠభరితంగా ఆ సీరియల్ చదువుతూ వాళ్ళు మళ్ళీ ఎలా ఆ లోయ నుంచి బయటపడతారోనని చిన్నప్పుడు తెగ ఆలోచించేవాణ్ణి. అయితే ఆ నవలను ఎవరు రాశారనేది మాత్రం అసలెప్పుడూ ఆలోచించనే లేదు! :-)

బొమ్మరిల్లు సంచికలు అక్కడక్కడా మిస్ అయి, ఆ కథ ఎలా ముగిసిందో చాలాకాలం వరకూ తెలియనేలేదు. తర్వాత... చాలా సంవత్సరాలకు ఆ నవల బొమ్మరిల్లు రెండు పాకెట్ పుస్తకాలుగా విజయవాడ బస్ స్టాండ్ బుక్ స్టాల్లో దొరికినపుడు ఎంత సంబరపడిపోయానో! ఏకబిగిన చకచకా కథ మొత్తం చదివేశాను. ఇప్పటికీ ఉన్నాయి, ఆ పుస్తకాలు భద్రంగా!

కిందటి సంవత్సరం మే నెలలో అభిమానిగానే కాకుండా జర్నలిస్టుగా కూడా  విజయవాడలో దాసరి గారిని కలుసుకున్నా కదా? ఆయన కథానాయకుల గురించి వివరాలు అడుగుతున్నపుడు ‘యశపాల జయకేతులు’ అనే మాటే అప్రయత్నంగా నా నోటివెంట వచ్చింది. అయితే వీళ్ళు ‘మృత్యులోయ’ హీరోలు కదా అని వెంటనే స్ఫురించింది. నా ‘పొరపాటు’ను చప్పున సర్దుకుని, ‘రాతిరథం- యక్ష పర్వతం ’లోని ఖడ్గవర్మ, జీవదత్తుల ఆహార్యం గురించి అడిగేశాను.

అయితే ‘పొరపాటు’న సరైన వ్యక్తినే అలా అడిగాననీ, నా ఎదురుగా ఉన్న వృద్ధమూర్తే ఆ ‘మృత్యులోయ’ కర్త అనీ అప్పుడు తెలీదు నాకు! అసలు ఆయనకు వినికిడిశక్తి సరిగా ఉండివుంటే నా మాటలు విని, సగర్వంగా మెరుస్తున్న కళ్ళతో ‘మృత్యులోయ’ రాసింది నేనే’ అని చెప్పివుండేవారేమో!

ఇక ఆ సంభాషణ అంతటితో ఆగుతుందా? మిగిలిన ప్రచ్ఛన్న రచనల ప్రసక్తి తప్పనిసరిగా వచ్చివుండేది.

సాంఘిక కథలూ, డిటెక్టివ్ నవలలూ కూడా రాసిన సుబ్రహ్మణ్యం గారు దాసు , డి.భవానీ ప్రసాద్, టి. శంభుదాస్, సుజాతల పేర్లతో 1950ల నుంచి 80ల వరకూ రచనా వ్యాసంగం సాగించారు.


*******

మూడు పుస్తకాలూ కలిపి రూ.360కే !

‘యువ’ మాసపత్రికలో వచ్చిన ‘అగ్నిమాల’(1975) సీరియల్ లో మాత్రమే దాసరి సుబ్రహ్మణ్యం గారి పేరు ప్రచురించారు. ఆ ‘యువ’ సంచికలు దొరుకుతాయేమోనని దా.సు.గారు తన జీవితకాలంలో చాలా ఎదురుచూశారు. అది సాధ్యం కాలేదు.

వాటిని ఈ మధ్యనే ‘రచన’ శాయి గారు పట్టేశారు. (ఇదొక్కటే కాదులెండి, దా.సు. గారి సినీతార దుర్మరణం (ఆంధ్రప్రభ సీరియల్- 1953), ఇంకా చాలా సాంఘిక కథలను శాయిగారు అన్వేషించి, సాధించారనుకోండీ).

‘అగ్నిమాల’,

‘మృత్యులోయ’ నవలలనూ,

దాసరి గారి 39 సాంఘిక కథలనూ

మూడు పుస్తకాలుగా ‘వాహినీ బుక్ ట్రస్ట్’ తరఫున శాయి గారు ప్రచురిస్తున్నారు.


ఈ సాంఘిక కథల, జానపద నవలల ఆవిష్కరణ 2011 జనవరి 27న జరగబోతోంది.   సాయంత్రం 6 గంటలకు.

హైదరాబాద్ అశోక్ నగర్ లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ సమావేశ మందిరంలో బాలసాహిత్య పరిషత్ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంది.

ఇదిగోండి... ఆహ్వాన పత్రిక!


రూ.360 ఎం.ఒ./ డి.డి. ద్వారా ఇక్కడ ఇస్తున్న అడ్రసుకు పంపితే  ఈ  మూడు పుస్తకాలనూ రిజిస్టర్డ్ పోస్టులో అందుకోవచ్చు.

వాహినీ బుక్ ట్రస్ట్, 1-9-286/2/పి
విద్యానగర్, హైదరాబాద్- 500 044

ఫోన్ నంబర్ : 040-27071500.







2, జనవరి 2011, ఆదివారం

ఆమె విమర్శ అనితర సాధ్యం!


దరంగ క్రీడలో ఏ ఎత్తు వేసినా మరింత దిగజారే పరిస్థితి ఒకటి ఉంటుంది.  విమర్శకు గురయ్యేవారికి అలాంటి స్థితినే కల్పిస్తారు రంగనాయకమ్మ గారు. తన అక్షర శరాలతో అవతలివారిని ఊపిరాడకుండా అష్ట దిగ్బంధనం చేసేసి, నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తారు ! 

కొత్తగా విడుదలైన రంగనాయకమ్మ గారి వ్యాసాల సంకలనంలో  దీనికి కొన్ని తార్కాణాలు కనపడతాయి. 

ఈ పుస్తకంపై ఇవాళ ‘ఈనాడు ఆదివారం’లో  క్లుప్త సమీక్ష వచ్చింది. 

ఇక్కడ చూడండి.

ఈ పుస్తకం  ఈ-బుక్ గా కినిగెలో ఇక్కడ లభిస్తుంది....
http://kinige.com/kbook.php?id=1021&name=Marxisme+Teliyakapote

రంగనాయకమ్మ గారి భావాలను వ్యతిరేకించేవారు కూడా ఆమె తేటతెల్లంగా, సరళంగా, స్పష్టంగా రాస్తారని ఒప్పుకుంటారు.  ముఖ్యంగా విమర్శల్లో ఆమె శైలి  పదునుగా, శక్తిమంతంగా కదం తొక్కుతుంది. అవి సాహితీపరమైనవి కావొచ్చు; సాహిత్యకారులపై చేసినవి కావొచ్చు- తిరుగులేని తర్కం, సమయోచితమైన ఎత్తి పొడుపు,  వ్యంగ్యం,  హాస్యం,  చురకలూ,  సూటిగా నాటుకునే వ్యాఖ్యలూ... ఆమె విమర్శల్లో మిళితమైవుంటాయి.  చెప్పదల్చుకున్నదాన్ని మినహాయింపులేమీ ఇవ్వకుండా... కుండబద్దలు కొట్టేలా చెప్పే సాహసం ఆమె రాతలకు విలువనిస్తుంది. 

పకడ్బందీగా వాటిని రాసే ‘స్కీమ్’ నాకు అబ్బురంగా కనిపిస్తుంది.   శ్రీశ్రీ, కొడవటిగంటిలపై గతంలో ఆమె చేసిన విమర్శలు చదివి తీరాల్సినవి! ఆమె విమర్శల్లో అంత నైశిత్యం ఎలా సాధ్యమయింది? భాషా నైపుణ్యం ఒక్కటే కాదు కారణం. ప్రధానమైనది భావ తీవ్రతే!  అరటి పండు ఒల్చినంత తేలిగ్గా... పూర్తిగా చదవాలనిపించేంత ఆసక్తిగా... చెరగని ముద్ర వేసేంత బలవత్తరంగా...  రాయగలిగే ఆ శైలి ఆమె భావాల తీవ్రతకు వన్నెలద్దుతుంది!

కొన్ని సందర్భాల్లో  ఆ విమర్శలు ‘చారిత్రక అవసరం’గా నాకు తోస్తాయి.  ఎందుకంటే... మిగిలిన రచయితలందరూ మర్యాదల కోసమో,  మొహమాటాలతోనో,  ‘మనకెందుకులే !’అనో తప్పుకునే సందర్భాల్లో కూడా ఆమె అలా చేయలేదు!  వాల్మీకి  కావ్యమయినా, వీరేంద్రనాథ్  నవలయినా అంతే!   ‘తులసిదళం’పై విమర్శల్లాంటి కేసుల్లో ఏళ్ళ తరబడి కోర్టుల కేసుల చికాకులెదురైనా ఆమె వెనుదీయలేదు; రాజీ పడలేదు.  నానీలపై చురకలు వేసినా, నక్సలైట్లను దుయ్యబట్టినా, అంబేద్కర్ ‘చాలడ’ని ప్రకటించినా ..  ఆమె విమర్శ అనితర సాధ్యం! 

తాజా వ్యాసాల సంకలనం ‘మార్క్సిజమే తెలియకపోతే పుట్టినవాళ్ళం పుట్టినట్టే ఉంటాం!’  ముఖచిత్రం మీదే  - ‘మానవ సమాజానికి మార్క్సిజమే జ్ఞానోదయం! సూర్యోదయం!’  అని ఉంటుంది.  సహజంగానే  సోషలిజం, కమ్యూనిజం, ‘శ్రమ దోపిడీ’లకు సంబంధించిన విషయాల్ని వివరంగా చర్చించే  వ్యాసాలు దీనిలో కనిపిస్తాయి. 

ఇతర వ్యాసాల సంగతికొస్తే...  రామాయణాన్నీ, రామాయణ విషవృక్షాన్నీ కూడా సమానంగా ఇష్టపడే రచయిత్రి  పవని నిర్మల ప్రభావతి గారితో రంగనాయకమ్మ గారి సంభాషణలు హృద్యంగా ఉంటాయి.  

‘ప్రగతి పట్టని ప్రగతి వాదులు’ అనే వ్యాసంలో  ఇప్పుడొస్తున్న సినిమాలపై  తన వ్యతిరేకతనంతా మాటల్లో గుప్పించి ఎలా రాశారో చూడండి- 
‘‘వెకిలి గంతుల డాన్సులూ, చవకబారు వెకిలి సంభాషణలూ, సెక్సూ- క్రైమూ నిండిన దుర్భర దృశ్యాలూ, అసహజమైన మసాలా కథలూ, కుత్రిమమైన సన్నివేశాలూ, తప్పుడు సందేశాలూ, పనికిమాలిన పరిష్కారాలూ- ఈ అస్తవ్యస్తపు సినిమా మత్తులో మునిగే తలకాయలకు , సినిమా నటులే దేవుళ్ళూ, దేవతలూ! జులాయి పాత్రల్లో గంతులేసేవాళ్ళు మరింత ఆకర్షణీయులు!’

న్. వేణుగోపాల్ గారిపై 2009 సెప్టెంబరులో చేసిన విమర్శ పాఠకుల్లో  చాలా చర్చనీయాంశమైంది.  వై.ఎస్.కు వేణుగోపాల్ గారు  సమర్పించిన నివాళిలోని కొన్ని మాటలను తన విమర్శలో శక్తిమంతంగా ఉపయోగించుకున్న విధానం గమనించదగింది. 
‘ఈ విప్లవ రచయిత..’- ‘ఆ ముఠా నాయకుడు..’ ;  ‘ఆ నాయకుడు...’, ‘ఈ విప్లవకారుడు..’ అంటూ వ్యాసం పొడవునా ఎత్తిపొడుస్తూ వాక్య విన్యాసం  చేస్తారు. 
 ‘‘...అయినా, ఆయన ‘‘దరహాసం’’, ‘‘వెచ్చని కరస్పర్శా’’, ఈ విప్లవకారుడికి ‘‘ఎప్పటికీ మరపురావు’’!  అని రాశాక,  ఆ వెంటనే  దూసుకొచ్చిన వ్యాఖ్య - ‘‘మరుపు వచ్చేసినది - విప్లవమే.’’

నామిని గారిని ‘బడాయి తగ్గించుకో’మంటూ  2010 ఫిబ్రవరిలో  విమర్శించిన  వ్యాసం  నేరుగా ఆయన్నే ఉద్దేశిస్తూ రాసిన లేఖలా ఉంటుంది.  ఇది కల్పనా రెంటాల గారికి ‘సూటిగా, కొంచెం మెత్తగా, కొంచెం కరుకుగా’ రాసినట్టనిపించింది.  నాకు  మాత్రం  కొంచెం మెత్తగానే కాదు;  చాలా కరుకుగానూ రాసినట్టనిపించింది. 
‘‘మంచి రసాల్ని ఊరించే నీ పుస్తకాల వల్ల నువ్వెంత నేర్చుకున్నట్టు? ఆ రసాలన్నీ మా కోసమేనా? నీ కోసం కాదా?’’ అనే ప్రశ్న అమోఘం!  ‘‘సన్మానాల్ని ఎలా సమర్థించుకోవాలో తోచని ఇబ్బందిలో పడిపోయావు’’ అనీ,  ‘‘బొత్తిగా, నిష్కారణంగా చాలా యాతన పడ్డావు’’ అనీ జాలి చూపిస్తారు. అంతలోనే  ‘‘నీ వాదన ప్రకారమే, ఇక నామిని అస్తమించాడన్నమాటే కదా?’’ అనే ముక్తాయింపు... పరాకాష్ఠ  అనిపించింది నాకు!  

‘పొద్దు’ వెబ్ పత్రికలో నిడదవోలు మాలతి గారు  తన ఇంటర్వ్యూలో  చేసిన  వ్యాఖ్యలపై రంగనాయకమ్మ గారు ఇచ్చిన  జవాబును కూడా  ఈ పుస్తకంలో చేర్చారు. బాలగోపాల్, వరవరరావు, శివారెడ్డిలపై రాసినవి కూడా ఉన్నాయి. 

వినుకొండ నాగరాజు గారి  ‘ఊబిలో దున్న’ నవలపైనా, ఆయన సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన తీరుపైనా ఆమె వ్యాఖ్యానాలు  ఆసక్తికరం.
‘‘వీరెప్పుడూ, మగ పళ్ళెంలో మగ అన్నం తింటారు. మగ గ్లాసుతో  మగ నీళ్ళు తాగుతారు!’’ అనీ,  ‘‘ఈ మొగ రచయిత, మొగ జలగ లాగ, వార్ని వదలలేదు’’ అని రాయటం చూస్తే భలే నవ్వొస్తుంది.
ఈ విమర్శను 36 సంవత్సరాల క్రితమే రాసినా, అదెక్కడో ఉండిపోయి ఇప్పటివరకూ ఎక్కడా ప్రచురితం కాలేదు. ఈ మధ్యనే  పాత కాయితాలు సర్దుతూ వుంటే ఇది బైటపడిందట!  ‘‘దీన్ని రాసినప్పుడు అంత ఆసక్తిగా రాసి, ఇన్ని సంవత్సరాల పాటు దీన్ని ఎలా మరిచిపోయానో  ఆశ్చర్యం!’’ అంటారామె.

ఈ బ్లాగులో ఇచ్చిన  నా ప్రొఫైల్ చూశారా? 
నాకు నచ్చిన రచయితలుగా రంగనాయకమ్మగారితో పాటు మరో ఇద్దరి పేర్లుంటాయి.


కొడవటిగంటి  కుటుంబరావు గారు,  వినుకొండ నాగరాజు  గారు (‘కమెండో’ ఎడిటర్)


రంగనాయకమ్మగారు  కొడవటిగంటి గారిపై  చేసిన విమర్శలు  ఎప్పటినుంచో తెలుసు. ఎటొచ్చీ వినుకొండ నాగరాజు గారే  ఆమె విమర్శల బారి నుంచి తప్పించుకున్నారని అనుకునేవాణ్ణి.

... కానీ ఇప్పుడా లోటు కూడా తీరిపోయింది! :)