సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

27, జనవరి 2012, శుక్రవారం

ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునే... కపాల దుర్గం !


నగనగా ‘చందమామ’లాంటి పత్రిక.  పేరు ‘ప్రమోద’!

అడుగుజాడలు చందమామవే అయినపుడు దానిలో  ‘కంచుకోట’లాంటి, ‘పాతాళ దుర్గం’లాంటి  జానపద సీరియల్  ఉండాల్సిందే కదా?

దాన్ని ఇంకెవరు రాయగలరు? ‘సుప్రసిద్ధ’ అజ్క్షాత రచయిత దాసరి సుబ్రహ్మణ్యం (దా.సు.) తప్ప!

అసలు ఆయన సహకారం ఉందనే హామీ దొరికాకే కదా  ‘బొమ్మరిల్లు’ అయినా, ‘ప్రమోద’ అయినా, ‘స్నేహబాల’ అయినా మొదలయింది!

అలా ‘ప్రమోద’లో ప్రారంభ సంచిక నుంచే  మొదలైంది ... ‘కపాల దుర్గం’!



నవల పేరే  వింతగా, భయ విస్మయకరంగా  లేదూ?

కపాలాలతో  కోట..  ఎవరు, ఏ ప్రయోజనం కోసం  కట్టివుంటారు? దానిలో ఎవరుంటారు? కథ ఏమైవుంటుంది?

30 నెలలపాటు సాగిన ఈ సీరియల్  చిత్రవిచిత్ర  సంఘటనలతో  దా.సు. సమ్మోహన అక్షరజాలంతో  పాఠకులను  బాగా ఆకట్టుకుంది.

ఇదంతా 33 ఏళ్ళ కిందటి ముచ్చట!

ఈ ‘కపాల దుర్గా’న్ని అక్షరాలతో ఎవరు కట్టారన్నది  చాలా కొద్దిమందికే తెలుసు. ఆ రహస్యం అలాగే  ఉండిపోయింది, సాహిత్య ప్రపంచానికీ, పాఠకులకూ  ఏమీ తెలియకుండానే!

దాసరి సుబ్రహ్మణ్యం గారు  చనిపోయిన ఏడాదికి ‘రచన’ పత్రిక ద్వారా  అది వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు ఆయన ద్వితీయ వర్థంతి (27.1.2012) నాటికి  ‘కపాల దుర్గం’ పుస్తక రూపం ధరించి  హైదరాబాదులో ఆవిష్కరణకు సిద్ధమైంది.

చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ  సమావేశ మందిరంలో జనవరి 27 (శుక్రవారం)  సాయంత్రం  6.30 గంటలకు బాల సాహిత్య పరిషత్తు ఈ పుస్తకావిష్కరణను నిర్వహిస్తోంది. ‘ప్రమోద’ సంపాదకులు  ధనికొండ శ్రీధర్, వేమూరి సత్యనారాయణలు  అతిధులుగా పాల్గొంటారు.

*  * *

‘ప్రమోద’లో  సీరియల్ గా వచ్చినపుడు  ఈ నవల గురించి నాకు  తెలియదు.  దా.సు. గారు ఈ నవలను రాశారని తెలిశాక, ఆసక్తి పెరిగింది.

ఇన్నేళ్ళ తర్వాత  ప్రూఫుల దశలోనే   చదివే అవకాశం వచ్చింది!

జానపద కథారణ్యంలో రచయిత అలవోకగా , అనితర సాధ్యంగా  కథనాన్ని కదం తొక్కిస్తుంటే,  ఉత్కంఠభరిత ఘట్టాలు సాగుతుంటే ఒకోసారి  అక్షరదోషాలను కనిపెట్టే  పని కాసేపు పక్కనపెట్టాలనిపించేది!

మనుషుల పుర్రెలతో  కోట కట్టే మాంత్రికుడూ-
అతడి  శిష్యుడు హరహర బైరాగీ-
కుక్క మొహంతో భయంకర పక్షి శునక భేరుండం-
చిత్ర విచిత్ర  జీవులూ,  గంధర్వులూ,  కింపురుషులూ-


ఆబాల గోపాలాన్నీ, అన్ని రకాల పాఠకుల్నీ అడుగడుగునా సంభ్రమాలతో ముంచెత్తే సంఘటనలు!


 ఈ పుస్తక నేపథ్యం గురించి వివరిస్తూ  దాసరి సుబ్రహ్మణ్యం గారిని ‘అజ్ఞాత సాహిత్య ముసుగు వీరుడు’గా పోల్చారు ‘రచన’ శాయి.

‘ ఆ కాలంలో (1950-81 సంవత్సరాల్లో) వెలువడిన ‘అన్ని’ పిల్లల మాస పత్రికలలోనూ అత్యద్భుత జానపద నవలలు రాశాడు ఆ అజ్ఞాత  సాహిత్య వీరుడు. తన  సాహిత్యం అందరినీ చేరి అలరించాలన్న తపనే కాని, తనకి పేరు ప్రఖ్యాతులు రావాలనే కోరిక అణుమాత్రం లేని నిస్వార్థ కామి ఆయన! ’ అని  ‘జానపద నవలా సమ్రాట్’ సాహిత్య తత్వాన్నీ, విశిష్టతనూ వెల్లడిస్తారు.

ముందుమాటలో ‘వసుంధర’ ఈ నవల ప్రత్యేకతలనూ, రచనా విశేషాలనూ  ఎంతో చక్కగా వివరించారు.  

‘కత్తి పామై వీరుల్ని భయపెడుతుంది. కర్ర మొసలిగా మారి తోడేలును ఢీకొంటుంది. సువర్ణ కంకాళాలు సజీవమై కదులుతాయి. కుక్క తల గండభేరుండ పక్షి- మనిషిలా మాట్లాడుతుంది. ఆకాశంలో గంధర్వుడు, కింపురుషుడు - బాహాబాహీ శృంగా శృంగీ పోరాడతారు.’ 

‘కథాంశం అద్భుతం. రసం హాస్యం. సందేశం సర్వ కాలీనం, చదవరికి వినోదం, విజ్ఞానం, వికాసం’ అంటూ అందంగా అభివర్ణిస్తారు వసుంధర.

ప్రమోదలో సీరియల్ గా వచ్చినప్పటి  బొమ్మలన్నిటినీ (నలుపు తెలుపుల్లో) ఈ పుస్తకంలో ఇవ్వటం విశేషం. ఇలాంటి జానపద గాథకు ‘చిత్రా’ బొమ్మలు అమరివుంటే  మరింత గొప్పగా ఉండేది.  కానీ తమ పరిధుల్లో చిత్రకారులు  ప్రియతమ్, కిరణ్, మల్లేశ్వర్, మురళి, నీలి బాగానే బొమ్మలను వేశారు.



 


 










ముందుకు సాగే పులి,  ఘీంకరించే ఏనుగు,  ముసుగు వేసుకున్న కోటశక్తి,  గుర్రాన్ని కాళ్ళతో  పట్టుకుని ఆకాశంలోకి లేచిన శునక భేరుండం ... లాంటి   కొన్ని బొమ్మల్లో చిత్రాను అనుకరించినట్టు స్పష్టంగానే కనపడుతుంది.  ఇది యాదృచ్ఛికం కాదు,  జానపద బొమ్మలపై చిత్రా ముద్ర అలాంటిది!

ఇంతకీ ఈ నవల కథ ఏమిటి?   చదివి తెలుసుకుంటేనే మజా!

వాహిని బుక్ ట్రస్ట్ (ఫోన్: 040-27071500) ,  మంచి పుస్తకం  సంస్థలు సంయుక్తంగా ప్రచురించాయి. 254 పేజీలున్న ఈ నవల వెల  150 రూపాయిలు.  

4 కామెంట్‌లు:

రవి చెప్పారు...

వేణూ గారూ, ఈ పుస్తకం ఎక్కడ దొరుకుద్ది? హైదరాబాద్ లో ఉంటే అర్జంటుగా నాకు చెప్పేసెయ్యండి.

మా ఇంట్లో, చందమామ, ఆ తర్వాత బాలజ్యోతి తెప్పించేవాళ్ళం. బొమ్మరిల్లు మిస్ కాకుండ లైబ్రరీలో చదివే వాణ్ణి. ప్రమోద మా ఫ్రెండు ఇంట్లో తెప్పించేవాళ్ళు. వాడికి నాకు అండర్ స్టాండింగు. నేను నా చందమామ ఇస్తే వాడు ప్రమోద ఇచ్చేట్టు. ఆ ఒడంబడికలో భాగంగా ప్రమోద లు చదివాను. ఈ బొమ్మలు చూస్తే సీరియల్ చిన్నతనంలో చదివినట్లు అనిపిస్తూంది.

వేణు చెప్పారు...

రవి గారూ, ఈ పుస్తకం హైదరాబాద్ లో నవోదయ, విశాలాంధ్రల్లోనూ, ఇతర బుక్ షాపుల్లోనూ దొరుకుతోందండీ.
మీ స్నేహితుల ‘చందమామ- ప్రమోద’ ఒడంబడిక చల్లగా, సంతోషంగా ఉంది!

రామ్ చెప్పారు...

వేణు గారూ

'ముసుగు వీరుడి' అద్భుతాల వర్ణన బాగుంది.దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి ఇప్పటికైనా తెలియటం బాగుంది. కొందరు కళాకారులు 'ముసుగు వీరులుగా' ఉంది పోవటానికి కారణాలు వెతికితే పరిశోధన కి మంచ్ టాపిక్ అవుతుందేమో

మీ పోస్ట్ ఎప్పుడూ... ఈస్ట్ మన్ కలర్ ఫుల్ గా ఉంటుంది. ఎట్లు సాధ్యము ?

వేణు చెప్పారు...

రామ్ గారూ! థాంక్యూ.
అవార్డులూ, ప్రచారం కోసం వెంపర్లాడే కళాకారులు కొందరైతే; తమ కళ గురించే తప్ప, పేరు ప్రఖ్యాతుల గురించి ఆలోచించని స్వభావంతో కొందరు ‘ముసుగు వీరులు’గా ఉండిపోతున్నారు. పరిశోధనకు మంచి టాపిక్కే.

ఇక ఈ బ్లాగు పోస్టులు ‘ఈస్ట్ మన్ కలర్ ఫుల్’ గా ఉంటున్నాయంటారా? అయితే దీనిలో నా పాత్ర చాలా పరిమితమే. నేను ఇష్టపడే కళాకారుల ప్రతిభా విశేషాలే ఇలా సవర్ణభరితంగా కనిపిస్తున్నాయేమో!