సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, మే 2012, గురువారం

స్టీఫెన్ హాకింగ్ కాలజ్ఞానం... నిజమవుతుందా?

‘కాలం కథ’తో పాఠకులను విశ్వవిహారం చేయించిన శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ .  ఆయన మరో రచన ‘కాల బిలాలూ పిల్ల విశ్వాలూ’ కూడా తెలుగు పాఠకులకు పరిచితమే.

 ఆధునిక కాలంలో్ ఐన్ స్టయిన్ స్థాయి శాస్త్రవేత్తగా పేరుపొందిన హాకింగ్ చేసిన వ్యాఖ్యలకు ఎంతో విలువ ఉంటుంది. వాటిపై  భిన్న కోణాల్లో చర్చలు జరగటం చాలా సహజం.

ఈ టపా ఆ రకమైనదే!  

వచ్చే వెయ్యేళ్ళలో  భూమి ధ్వంసమైపోతుంది కాబట్టి, మనుషులు ఇతర గ్రహాలకు వలస వెళ్ళక తప్పదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం.

ఈ భూమ్మీద బానిస వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాలు  కొనసాగింది.  భూస్వామ్య వ్యవస్థ  వైభవం మాత్రం వందల సంవత్సరాలకే పరిమితమైంది. మరి ఇప్పటి  పెట్టుబడిదారీ వ్యవస్థ ? దీనికింకా వెయ్యేళ్ళ ఆయుర్దాయం వుంటుందా? అంతకాలం అది మనలేకపోతే ఈ వ్యవస్థ తాలూకు  చెడుగులు మాత్రం ఎందుకు నిలిచివుంటాయి?

హాకింగ్  వ్యాఖ్యలపై ఓ మార్క్సిస్టు రాసిన  స్పందన ఇది...


అసలు విషయం తెలియని హాకింగ్!

సైన్సుకి సంబంధించిన ఏ విషయాలయినా ప్రకృతి ధర్మాలకి లోబడే  పనిచేస్తూ వుంటాయి. ప్రకృతి సూత్రాలకి అతీతమైన సైన్సు సూత్రాలు ప్రకృతిలో- అంటే ఈ విశ్వంలో ఎక్కడా  వుండవు. గతకాలంలో ప్రారంభమైన మానవజాతి మనుగడ వర్తమానం గుండా భవిష్యత్కాలంలోకి కొనసాగుతుంది. తన మనుగడ కొనసాగింపు క్రమంలోనే మానవుడు కొత్త కొత్త సైన్సు సూత్రాల్ని ఆవిష్కరిస్తూ దాని ద్వారా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ వున్నాడు.

కానీ మనిషికి ముఖ్యంగా ‘ఈస్తటిక్ ఎంజాయ్ మెంటు’, ‘ఎస్ట్రానమీ’లోనే వుంటుందనిపిస్తోంది. ‘కాళ్ళ కింద నరకం’ గురించి తెలుసుకోలేకపోయినా ‘నెత్తిమీద నరకం’ గురించి బాగానే అధ్యయనం చేస్తున్నాడు. భూగర్భంలోకి ప్రయాణం గట్టడం కన్నా అంతరిక్షంలోకి ప్రయాణం గట్టడమే సులువు కదా మరి!

గతకాలం నుంచీ ఇప్పటివరకూ కూడా జ్యోతిశ్శాస్త్ర  పండితులు యుగాంతాల గురించి హెచ్చరిస్తూనే వున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ... జ్యోతిశ్శాస్త్ర పాండిత్యాన్ని మించిపోయిన పాండిత్యంతో మానవాళి భవిష్యత్తూ, భూమి భవిష్యత్తూ అంటూ శాస్త్రవేత్తలు రకరకాల కాలజ్ఞానాలు చెప్తూ వుండడం...

 
 ‘వందేళ్ళ తర్వాత మార్స్ మీదే కాలనీలు’ అనీ, ‘అంగారకుడే గతి’ అనీ (ఆంధ్రజ్యోతి దినపత్రిక 9-1-12)లో ప్రఖ్యాత అంతరిక్ష భౌతిక శాస్త్రవేత్త  స్టీఫెన్ హాకింగ్ తన 70వ పుట్టిన రోజు సందర్భంగా బీబీసీ రేడియో చేసిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు.

గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు కావచ్చు, చేజేతులారా తెచ్చిపెట్టుకునే అణుయుద్ధం వల్లనైనా కావచ్చు. మరో వెయ్యేళ్ళలో  భూమి ధ్వంసమైపోతుందని, కాబట్టి  మన పాలపుంతలోని ఇతర గ్రహాలకు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా వుందని  హాకింగ్ అభిప్రాయం.

‘‘అంతరిక్షంలో కాలనీలు ఏర్పరచుకోవడం అత్యవసరం. ఎప్పటికైనా మనం అంగారకుడి పైనా, సౌరవ్యవస్థలోని ఇతర గ్రహాల పైనా కాలనీలు ఏర్పరుచుకుని స్వయం స్వావలంబన సాధిస్తామని నాకు గట్టి నమ్మకం. అయితే వచ్చే వందేళ్ళ లోపు ఇది జరిగే అవకాశం లేదు.’’ - ఇవీ హాకింగ్ అభిప్రాయాలు.

అయితే హాకింగ్ గానీ, హాకింగ్ లాంటి శాస్త్రవేత్తలు ఎవరైనా గానీ ఈ రకమైన అభిప్రాయాలు చెప్తే, ఈ రకమైన సూత్రీకరణలు చేస్తే  అవి తప్పు అభిప్రాయాలే; తప్పు సూత్రీకరణలే!

హిరోషిమా, నాగసాకిలపై వేసిన యురేనియం బాంబులు ఎంత విధ్వంసం సృష్టించాయో మనందరికీ తెలుసు. ఈనాడు  ప్రపంచంలోని చాలా దేశాలు తమ ఆయుధాగారాల్లో  కొన్ని వందల టన్నుల యురేనియం బాంబులూ, హైడ్రొజన్ బాంబులూ పెట్టుక్కూచున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ బలాస్టిక్ మిస్సయిల్స్ ... వార్ హెడ్స్ మోసుకుపోయి ఏ ఖండంలో అయితే ఆ ఖండంలో వేసెయ్యడమే. మనిషి గనక ఈ ఆయుధాల్ని వుపయోగిస్తే  మహా విధ్వంసం సంభవిస్తుంది. భూగోళం  తునాతునకలైపోతుంది. ఇంక ఈ ఆయుధాలు అన్నిటినీ గనక ప్రయోగిస్తే భూగోళం అనేకసార్లు ముక్కులు చెక్కలైపోతుంది.

హాకింగ్ జోస్యం చెప్పినట్టు మరో వెయ్యేళ్ళ వరకూ ఆగాల్సిన పనిలేదు. మరో ప్రపంచ యుద్ధం గనక మొదలైపోతే రేపే ప్రపంచానికి ఆఖరి ఘడియలు రావచ్చు. అణు విధ్వంసంతో భూగోళం అంతమైపోవచ్చు.

అయితే ఈ విషయాలు హాకింగ్ కి తెలియవా అంటే ఎందుకు తెలియవు? అంత మహా శాస్త్రవేత్త కి చక్కగానే తెలుస్తాయి. అవన్నీ తెలిసే హాకింగ్ ఈ రకమైన అంచనాలకి వచ్చారు. అవకాశాలంటే  వున్నాయి గానీ రేపంటే రేపే యుద్ధాలు ప్రారంభమైపోవు గదా!

ఇప్పుడున్న టెక్నాలజీని ఆధారం చేసుకుని దానివల్ల భౌగోళిక పరిస్థితుల్లోని మార్పులు గమనించుకుంటూ వెళితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ ప్రమాదం రావచ్చు. లేకపోతే వెయ్యేళ్ళనాటికి మానవుడు తెలివైనవాడు కావచ్చు.

(మానవుడు ఇంకా తెలివైన వాడు కాదని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. తెలివైన జాతులు తమని తామే పేల్చేసుకుంటాయని సైన్సులో ఓ లోకోక్తి ఉంది).

అందుకనే ఏ మార్స్  మీదో,  లేకపోతే వేరే నక్షత్ర కుటుంబంలోని గ్రహాల మీదో మానవులు వలసలు ఏర్పరచుకుంటే భూగోళానికి ఎలాంటి విధ్వంసం సంభవించినా మానవజాతి మనుగడ మరో లోకాల్లో కొనసాగుతుందని హాకింగ్ అభిప్రాయపడ్డారు.

హాకింగ్ మాటలు చదవకుండానే ఒక మిత్రుడు ఇలా అన్నాడు- ‘‘ఆఁ ! ఏముందీ. మనిషి భూమి మీద లేనప్పుడు భూమి చక్కగానే వుంది. మనిషి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతే భూమి చక్కగానే వుంటుంది. సమస్యల్లా మనిషి వల్లే! ’’

హాకింగ్ మాటలకీ, హాస్యంగా అన్న మిత్రుడి మాటలకీ పెద్దగా తేడా లేదనే చెప్పాలి.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం...

ఆ అసలు విషయం మానవ సమాజ పరిణామ క్రమం.. మోర్గన్ సమాజ పరిణామ క్రమాన్ని కొన్ని దశలుగా విభజించాడు.  ఆటవిక దశలో ప్రారంభమైన మానవ సమాజం అనాగరిక దశల గుండా ప్రయాణించి నాగరిక దశలోకి చేరుకుంది. మోర్గన్ నిర్దేశించిన సూత్రాలు మార్క్సిస్టు మౌలిక సూత్రాలకి అనుగుణంగానే వున్నాయి.

మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రకారం మానవ సమాజం నిమ్న దశల్లో ప్రారంభమై అంతకంతకూ అభివృద్ధి చెందుతూ వున్నత దశల వేపుగా ప్రయాణం చేస్తోంది. సమాజ పరిణామ  క్రమం ఈ రకంగా వుంది-

ఆటవిక సమాజం నుండి జీవితాన్ని ప్రారంభించిన మానవజాతి బానిస సమాజంలోకి,
దాన్నుండి భూస్వామ్య (ఫ్యూడల్)  సమాజంలోకి,
దాన్నుండి బూర్జువా ( పెట్టుబడిదారీ)  సమాజంలోకి ..  మార్పు చెందుతూ వస్తోంది.

ఒక సమాజం నుండి ఇంకో  సమాజంలోకి  మానవజాతి మార్పు చెందడానికి మహా విప్లవాలు జరిగినయ్. ఇప్పుడున్నది పెట్టుబడిదారీ సమాజం. ప్రపంచమంతా ఈ పెట్టుబడిదారీ ప్రభువుల గుప్పిట్లోనే వుంది. (ఇంతకంటే ఎక్కువ వివరించడానికి ఇక్కడ అవకాశం లేదు).

మానవజాతి అంతా రెండు మహా శిబిరాలుగా చీలిపోయి వుంది. ఆ రెండూ ఒకదానికొకటి శత్రు వర్గాలు. ప్రతీ సమాజంలోనూ దోపిడీ పీడనలకి గురైన వర్గం - దాని శత్రువర్గం మీద చేసే యుద్ధాల ద్వారా ఒక సమాజం నుంచి ఇంకో సమాజం ఆవిర్భవిస్తూ వచ్చింది. అలా మారడానికి వందల వేల సంవత్సరాల కాల పరిమితి బట్టింది. గత సమాజాల ఆయుర్దాయం కంటే ఈ పెట్టుబడిదారీ సమాజ ఆయుర్దాయం చాలా తక్కువ.

‘‘పెట్టుబడిదారీ వర్గ పతనమూ అనివార్యమే. కార్మిక వర్గ విజయమూ అనివార్యమే’’ అని కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికలో మార్క్స్ , ఎంగెల్సులు చెప్పారు. పెట్టుబడిదారీ సమాజం తర్వాత అనివార్యంగా వచ్చే సో్షలిస్టు సమాజం,  దాని తర్వాత వచ్చే కమ్యూనిస్టు సమాజం కూడా మానవాళికి తెలుసు.

ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజం పతనావస్థలో వుంది. తన గూట్లో తనే చిక్కుకున్న సాలీడులా మరణ సదృశమైన సంక్షోభాల్లో తనే చిక్కుకుపోతోంది.... పెట్టుబడిదారీ సమాజ స్థానాన్ని అనివార్యంగా సోషలిస్టు సమాజం ఆక్రమిస్తుంది.

గత సమాజాల పరిణామ క్రమాన్ని అంచనా వేస్తే రాబోయే వెయ్యేళ్ళ కాల పరిమితి అవసరం లేదనే తోస్తోంది. తక్కువ కాల వ్యవధిలోనే కమ్యూనిస్టు సమాజం ఆవిర్భవిస్తుందని ఊహించడం సంభవంగా తోస్తోంది.

కమ్యూనిస్టు సమాజం వుపయోగపు విలువ అనే కోణంలోనే వుత్పత్తులన్నిటినీ వుత్పత్తి చేస్తుంది. పనికిరాని చెత్తంతా అది ఈడ్చిపారేస్తుంది. ఆటంబాంబులేంటి, హైడ్రొజన్ బాంబులేంటి-   అలాంటి వాటినన్నటినీ పనికిరాకుండా నాశనం చేసేసి డస్ట్ బిన్ లో పడేస్తారు!

టెక్నాలజీ సమాజాన్ని ఇన్ ఫ్లుయెన్స్ చెయ్యదు. సమాజమే టెక్నాలజీని ఇన్ ఫ్లుయెన్స్ చేస్తుంది. అమల్లో వున్న సమాజ ప్రభావాన్ని బట్టే టెక్నాలజీ దాని పని అది చేస్తుంది.

గత కాలపు ప్రభువులంతా కాలగర్భంలో కలిసిపోయారు. ఏరీ వాళ్ళిప్పుడు? ఈ పెట్టుబడిదారీ ప్రభువులేనా శాశ్వతం! పెట్టుబడిదారీ సమాజ చర్యల ఫలితంగానే భూగోళాన్ని సకల రుగ్మతలూ పట్టుకున్నాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ లేంటి, ఏ వార్మింగులైనా రావచ్చు.

అల్పాయుష్కురాలైన ఈ పెట్టుబడిదారీ సమాజం రాబోయే వెయ్యేళ్ళ కాలం మనగలుగుతుందా అని ఇక్కడి  ప్రశ్న. అలా మనగలిగితేనే హాకింగ్ జోస్యం ఫలిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల గానీ, అణు విధ్వంసంవల్లగానీ భూగోళం నాశనమవుతుంది. మానవాళికి మరణం సంభవిస్తుంది!

అయితే మార్క్సిస్టు మహోపాధ్యాయుల్లో ఒకరైన ఎంగెల్సు ఏమన్నాడో ఇక్కడొకసారి చూద్దాం...  ‘‘మానవ కార్యకలాపాల పరిణామం మొత్తంగా భూమండలం లుప్తమైపోయినప్పుడు తప్ప లుప్తం కాదు’’. పై మాటలు ఏం చెప్తున్నాయి? పెట్టుబడిదారీ సమాజం శాశ్వతం కాదని చెప్పడమే, దాని చర్య ఫలితంగా జరిగే సకల విధ్వంసాలూ శాశ్వతం కాదని చెప్పడమే!

పెట్టుబడిదారీ సమాజం తర్వాత అనివార్యంగా వచ్చే సోషలిస్టు సమాజం, ఆ తర్వాత వచ్చే కమ్యూనిస్టు సమాజాల్లో మానవాళి సకల రుగ్మతలూ పోగొట్టుకుని సుఖశాంతులతో జీవిస్తుంది!

అందుచేత మన భూగ్రహానికొచ్చిన ఢోకా ఏమీ లేదు. వేరే గ్రహాలకి పలాయనం చిత్తగించాల్సిన పని అంతకన్నా లేదు.

గ్రహాల లెక్కలూ రాశుల లెక్కలూ వేసే జ్యోతిశ్శాస్త్ర పండితులు సైన్సు సూత్రాల కచ్చితత్వాన్ని ఏ రకంగా అయితే అర్థం చేసుకోకుండా వదిలేస్తారో, భూమి భవిష్యత్తూ మానవజాతి భవిష్యత్తూ అంటూ జ్యోతిషుల్ని తలదన్నే పాండిత్యంతో మాటలాడుతున్న శాస్త్రవేత్తలు కూడా సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూవున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే- విశ్వాంతరాళంలోకి తొంగిచూసిన హాకింగ్ మేధస్సుకి... ఖగోళాలతో గోళీలాడుతున్న హాకింగ్ మేధస్సుకి ... అసలు విషయం తెలియకుండా పోయింది!

- కోటిలింక  త్రిమూర్తులు  (తుని)