సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, డిసెంబర్ 2013, బుధవారం

మ్యాగజీన్ నడిపే కళలో తిరుగులేని ‘కమెండో’... నాగరాజు గారు!

తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన నవల  ‘ఊబిలో దున్న’ ఇవాళ ఈ -బుక్ గా విడుదల అయింది.   http://kinige.com/kbook.php?id=2408&name=Oobilo+Dunna

 ‘కమెండో’ ఎడిటర్ వినుకొండ నాగరాజు గారు రాశారిది.



ఏమిటీ పుస్తకం ప్రత్యేకత?
డాక్టర్  కేశవరెడ్డి  గారు  ‘అతడు అడవిని జయించాడు’ 1984లో రాశారు.  అప్పటికి 14 సంవత్సరాలముందే  1970లో నాగరాజు గారి  ‘ఊబిలో దున్న’ నేరుగా పుస్తకరూపంలో వచ్చింది.

ఈ రెండు నవలలూ ‘చైతన్య స్రవంతి’ (ఛాయల) లో రాసినవే.  రెండిటికీ  స్ఫూర్తినిచ్చిన నవల ఒకటే- అది హెమింగ్వే రాసిన  ‘The old man and the sea'.

పాఠకుల్లో చాలామందికి కేశవరెడ్డి గారి నవల తెలుసు కానీ, అంతకుముందే వచ్చిన నాగరాజు గారి నవల విషయం తెలియదు.  నవలాచరిత్రల వ్యాసాల్లో మాత్రమే ఈ  నవల ప్రస్తావన కనిపిస్తుంటుంది.  

‘ఊబిలో్ దున్న’ను మార్చి 1970లో ఎమెస్కో సంస్థ ప్రచురించింది.

ముఖచిత్రాన్ని బాపు వేశారు.


ఆరున్నర గంటలలో అసాధ్యాన్ని సాధించిన అసహాయ శూరుడి కథ ఇది. ఊబిలో కూరుకుని ప్రాణం వొదిలేస్తున్న దున్నను దాని శక్తిని దానికి తెలిసేలా చేసి ఊబినుంచి బయటకు రప్పించటానికి  ఓ  రైతన్న చేసిన ప్రయత్నం.

ప్రాణగండం నుంచి బయటపడ్డ దున్న రైతు పట్ల కృతజ్ఞత చూపిందా లేదా? ఎలా స్పందించింది?  అనేది ముగింపు.  ప్రతీకాత్మకంగా దీన్ని సమాజానికి అన్వయించటం ఉంటుంది.

పాత పుస్తకాల షాపులో...
ఈ నవల గురించి విన్న చాలాకాలం వరకూ నేను చదవనేలేదు.  రెండు దశాబ్దాల క్రితం కూడా అది అందుబాటులో లేకపోవటమే దీనికి కారణం.  చివరకు విజయవాడ పాత పుస్తకాల షాపుల్లో దొరికింది.

చదివాను.  

చాలామంది పాఠకులకు ఈ పుస్తకం గురించి తెలుసు. కానీ వాళ్ళు చదవటానికి పుస్తకాల షాపుల్లో  దొరికితేగా?

ఇన్నేళ్ల తర్వాత  నాగరాజు గారి జయంతి సందర్భంగా  ఇవాళ ‘ఊబిలో దున్న’ ఈ-బుక్ రూపంలో నవతరం పాఠకులను చేరుతోంది.


ఏడు సంవత్సరాల క్రితం...  
ఆ సాయంత్రం వానజల్లులు పడుతున్నాయి. ‘కమెండో’ నాగరాజు గారి దగ్గర్నుంచి ఫోన్ !  నన్ను రమ్మంటూ ఆహ్వానం... ‘వానొస్తోంది కదా, ఏం వెళ్తాంలే’ అనిపించి వాతావరణం సంగతి ఆయనతో ప్రస్తావించాను.

‘ఆ మాత్రం దానికే ఆగిపోవాలా?’ అనే భావంతో ‘నదీ నదాలూ అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి?’ అంటూ శ్రీశ్రీ కవిత్వ పంక్తులు ఆయన కంఠంలో ఖంగుమని మోగాయి.

నా తటపటాయింపుకు ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. వెంటనే బయల్దేరి వెళ్ళాను.

దాదాపు ఏడేళ్ళ నాటి సంగతి ఇది!


నాగరాజు గారితో వ్యక్తిగతంగా నా సాన్నిహిత్యం వయసు నాలుగేళ్ళే! ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చినపుడు ఓ అభిమానిగా ఆయన్ను కలిసి, మాట్లాడాను. అంతే. అయితే ‘కమెండో’ రూపంలో ఆయనతో నాకున్న పాఠకానుబంధం 27 ఏళ్ళుగా పెనవేసుకునివుంది.

ఏ ఊళ్ళో న్యూస్ స్టాల్స్ దగ్గరకు వెళ్ళినా కమెండో కోసం నా కళ్ళు వెతికేవి. పత్రిక కనిపించగానే ఆత్మీయనేస్తం దొరికినంత సంతోషం కలిగేది.

హేతువాద దిక్సూచి
నాలో హేతువాద భావాలు స్థిరపడటానికి ‘కమెండో’, ‘వెరయిటి’ పత్రికలే కారణం. మిత్రులతో వీటిలోని వ్యాసాల గురించి చర్చించటం అలవాటుగా ఉండేది. హైస్కూలు, జూనియర్ కాలేజీల రోజుల్లో మాలాంటి పల్లెటూరి కుర్రాళ్ళకు కమెండో, వెరయిటీలే దిక్సూచిగా కనిపించేవి. మా తరానికి చెందిన ఎందరినో ఈ పత్రికలు ప్రభావితం చేశాయి.

‘వెరయిటి’లో వచ్చిన  అంతర్జాతీయ నవలల అనువాదాలు తెలుగు పాఠకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. అబ్రహాం టి. కోవూర్ వ్యాసాలు నాగరాజు గారి శైలిలో కొత్త సొబగులు దిద్దుకునేవి. అవీ, మరెన్నో కథనాలూ నాలాంటివారి హేతువాద పునాదిని పటి్ష్ఠం చేశాయి.

బెర్ముడా ట్రయాంగిల్ లాంటి అద్భుతాలూ, ‘రండి, ఈ ప్రపంచాన్ని జయిద్దాం!’ లాంటి వ్యక్తిత్వ వికాస రచనలూ సమ్మోహనపరిచేవి, జ్ఞానాన్ని ఇచ్చేవి.

ఇవన్నీ ఎడిటర్ (వినుకొండ నాగరాజు ) ఒంటిచేత్తో రాసేవారని తెలిసి, ఆశ్చర్యంతో తలమునకలయ్యేవాణ్ణి!

అమిత ప్రభావం
నాగరాజు గారి ప్రభావం నా మీద ఎంత బలంగా ఉందో రెండు విషయాలు చెప్తే చాలు. ఆయన ఎం.ఎ. ఆంగ్ల సాహిత్యం చదివారు కాబట్టి నేను డిగ్రీలో స్పెషల్ ఇంగ్లిష్ తీసుకున్నాను. ఆయన స్ఫూర్తితోనే జర్నలిజాన్ని ఇష్టపడి ఎంచుకున్నాను.

1986లో కమెండోలో ‘మేమూ చెప్పదలిచేము’ అనే శీర్షికకు ఒక లేఖ రాశాను. అమర్ వేసిన కార్టూన్ తో దాన్ని ప్రచురించినప్పుడు సంబరపడిపోయాను.

విజయవాడలో డిగ్రీ చదివేటప్పుడు న్యూస్ స్టాల్స్ లో ‘కమెండో’ (ఇంకా ఇతర పీరియాడికల్ మ్యాగజీన్స్) విక్రయించటంపై పోలీసు ఆంక్షలుండేవి. పత్రిక చదవటం కోసం తపించిపోయేవాణ్ణి. పింగళి దశరథరామ్ హత్యపై వచ్చిన సంచికను గుంటూరు నుంచి స్నేహితుడు తెచ్చి ఇస్తే చదవగలిగాను.

‘కమెండో’ లోగో ఒక పోరాట పత్రికకు తగినట్టుగా ఎంతో ఆకర్షణీయంగా నాకు కనిపిస్తుంది.

   ఒక కదలిక, చైతన్యం, వేగం స్ఫురించేలా ఉండే ఆ అక్షరాలంకరణను యథాతథంగా కాగితంపై చెక్కటం నాకు సరదాగా ఉండేది.

క్లాసిక్  కథనాలు

కమెండో ‘క్లాసిక్స్’ అని పేర్కొనదగ్గ ఆర్టికల్స్ ను చెప్పమంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. 

‘ఎవడురా ప్రకాశం పంతుల్ని తిట్టాడుట?’ వ్యాసం వ్యంగ్య రచనా వైభవానికి పరాకాష్ఠ. ఆంధ్రకేసరి ఊతపదమైన ‘ఎవడురా’ అనే మాటను ఉపయోగించటం ఒక్కటే కాదు; గ్రాంథిక శైలిలో శరపరంపరంగా విరుచుకుపడే పదగుంఫనతో సాగే కత్తిపదును లాంటి వాదన మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

కపట మాయోపాయాల యోగుల బతుకుల నిజ స్వరూపాన్ని నిశిత హేతువాద వాదనాస్త్రంతో తుత్తునియలు చేసిన విజయగాథ ‘యోగితో తలపడ్డ ఎడిటర్’.

అక్కసుతో లాయర్  నోటీసులు పంపినవారినీ  ( ‘ఉపేంద్ర పరువు అమ్మకానికి వచ్చింది. ఖరీదు పది లక్షలు!’), చట్టసభల్లో పత్రికలోని ‘భాష’పై  ధ్వజమెత్తిన రాజకీయ నాయకులనూ నిర్భీతితో నిప్పులు చెరిగే అక్షరాలతో ఎదుర్కొన్న తీరు విభ్రాంతి గొలిపేది.

రాసే సబ్జెక్టుకు తగ్గట్టు భాష కదం తొక్కేది. మేధావి పాఠకులకు మెచ్చే రీతిలో భాషా ప్రయోగాలు ఉండేవి.

గ్రీకు, హిందూ పురాణ గాథలనూ, చారిత్రక సంఘటలనూ, ఆంగ్ల సాహితీ రసవద్ఘట్టాలనూ ఉటంకిస్తూ , వర్తమాన రాజకీయ పరిణామాలతో పోలుస్తూ  ఎడిటర్ నాగరాజు గారు చేసే వ్యాఖ్యానాలు అనితర సాధ్యం. షేక్ స్పియర్ ‘జూలియస్ సీజర్’ లోని మార్క్ ఆంటోనీ మహోపన్యాసం , క్రిస్టఫర్ మార్లో ‘డాక్టర్ ఫాస్టస్’లోని హెలెన్ వర్ణనా (‘ఈ ముఖమేనా మన కాబోయే ముఖ్యమంత్రి?’) ఈ  కోవలోవే.

మెరుపు వ్యాఖ్యలు
అనువాదం  అంత సరళంగా ఉండదనే విమర్శ ఆయన పట్ల ఉంది.  కానీ  నాలాంటివాళ్ళకు ఆ అనువాదం తీరు ముచ్చటగా అనిపించేది. ‘హెన్ పెక్ డ్ హజ్బెండ్ ను ‘పెట్టమారి మొగుడు’ గానూ, ‘మిస్ బెన్నెట్ ’ను ‘బెన్నెట్ సతి’ గానూ అనువదించి, ఒప్పించిన ఘనత ఆయనది.

కమెండోలో శీర్షికలు ఎంత పొడుగ్గా ఉన్నా ఆకట్టుకునేవి. ఒక రకమైన ఇంద్రజాలం ఆ అక్షరాల పొందికలో ఉందా అనిపిస్తుంది.

ఏ టాపిక్ రాసినా తిరుగులేని పఠనీయతతో పాఠకులను తనతో లాక్కెళ్ళే శైలి నాగరాజు గారిది. ఈ రచనాశైలి గురించి రెండు మూడు సార్లు ప్రశంసిస్తూ మాట్లాడబోతే  ‘చా... ఊరుకోండీ!’ అంటూ వారించేవారు.

కమెండోలో చిన్నచిన్న బిట్స్ కు ఆయన మెరుపుల్లాంటి వ్యాఖ్యలు జోడించి , రసగుళికల్లా మార్చేవారు. అంతెందుకు? సమాచారాన్ని తెలిపే సాధారణ కరపత్రం రాసినా ఆయన ముద్ర కనిపించేది. జనరంజకంగానూ, ప్రయోజనాత్మకంగానూ మ్యాగజీన్ ను తీర్చిదిద్దే కళలో ‘మాస్టరీ’ సాధించారాయన !

‘చైతన్యస్రవంతి’ (స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్ నెస్) క్లిష్టమైన శిల్పం. దీనిలో నవలలు రాసిన కొద్దిమంది రచయితల్లో ఈయన ఒకరు. ‘ఊబిలో దున్న’తో పాటు  ‘తాగుబోతు’, ‘ఎంతదూరం’ నవలలు ఈ విధానంలో రచించినవే!

తెలుగు  పీరియాడికల్ (మ్యాగజీన్స్ ) చరిత్రలోనే కాదు;  తెలుగు నవలా చరిత్రలో కూడా నాగరాజు గారిది ఓ ప్రత్యేక స్థానం!