సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, జనవరి 2013, మంగళవారం

పలనాటి సీమను పాలస్తీనాగా మార్చిన ‘కరుణామయుడు’!



కృష్ణుడు అంటే - ఎన్టీఆర్!
క్రీస్తు అంటే - విజయచందర్!!


ఎన్టీఆర్ కి సొంత ఊరు (1956) లో కృష్ణుడి పాత్ర సరిగా కుదరని చేదు అనుభవం ఒక్కటే. ఏడాది తిరిగేసరికల్లా ‘మాయాబజార్’తో  సినీ శ్రీకృష్ణావతరణం జరిగింది.  

కానీ విజయచందర్ క్రీస్తు పాత్ర పోషణ ప్రేక్షకుల ముందుకు రావటానికి ఐదు సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టింది.

అడుగడుగునా చిత్రనిర్మాణపు కష్టనష్టాల శిలువను మోయాల్సివచ్చిందాయన. 

పట్టిన పట్టు వీడకుండా ‘కరుణామయుడు’(1978) తీసి విడుదల చేస్తే... అఖండ విజయం సాధించింది!  

‘మాయాబజార్’ కృష్ణుణ్ణి తీర్చిదిద్దింది కళాదర్శకుడు మా.గోఖలే!
‘కరుణామయుడు’ క్రీస్తును రూపు కట్టించింది రూపశిల్పి ముండూరి సత్యం!!

ఆర్థిక సమస్యలతో  ఆగుతూ సాగుతూ, మధ్యలో దర్శకుడు ఎ. భీమ్ సింగ్ మరణంతో కుదుపుకు గురై, తర్వాత  ఆయన అసిస్టెంట్ తిరుమలై ఆధ్వర్యంలో కొనసాగింది ‘కరుణామయుడు’ చిత్రనిర్మాణం.

ఇన్ని అడ్డంకులతో ఐదేళ్ళపాటు  తీసిన ఏ సినిమా అయినా  నాణ్యంగా వచ్చే అవకాశం చాలా తక్కువ.  కానీ ఈ సినిమా ప్రమాణాల పరంగా ఉన్నతస్థాయిలో నిలవటం విశేషం.  రెండువేల ఏళ్ళనాటి వాతావరణ సృష్టి, సంగీత సాహిత్యాలు, పాత్రధారుల నటన , సాంకేతిక హంగులు ఇవన్నీ చక్కగా కుదరటం అరుదైన విషయమే!

అవసరమైనంత  డబ్బు చిక్కక...
చిక్కుల సుడిగుండంలో చిక్కుకుని ఎలాగో బయటపడుతూ
ఎట్టకేలకు సినిమాను పూర్తిచేసిన విజయచందర్...

 ఆ క్లేశాల ప్రభావమేదీ కనపడకుండా ..
 తన పాత్రకు అనితర సాధ్యంగా  ప్రాణప్రతిష్ఠ చేయటం మరో పెద్ద విశేషం!

‘క్రీస్తు దొరికాడు..’


కౌబాయ్ వేషాలు వేసే  విజయచందర్...  క్రీస్తు పాత్రకు  సరిపోతారని మొట్టమొదట గుర్తించింది ఎవరు?

ఆయన పేరు తంగప్ప.  తమిళంలో ప్రసిద్ధ దర్శకుడు.

‘కరుణామయుడు’ సినిమా ఆరంభానికి రెండేళ్ళముందు 1972లో ఆయన ‘మేరీమాత’ సినిమా తీశారు.

ఆ సినిమా కోసం విజయచందర్ కు స్క్రీన్ టెస్ట్ చేసి ఆనందంగా నాకు క్రీస్తు దొరికాడు’ అన్నారట! డేట్లు కుదరక విజయచందర్ కు  ఆ సినిమాలో పాత్ర మిస్సయింది. 

తర్వాత 1974లో ‘రారాజు క్రీస్తు’ కోసం క్రీస్తు పాత్రకు ఎంపికైనప్పటికీ  ఆ సినిమా నిర్మాణం నాలుగురోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది.

దీంతో... నటుడిగా తన ఉనికి నిలబెట్టుకోవటం కోసం అదే కథను  ‘కరుణామయుడు’ ప్రాజెక్టుగా నెత్తికి ఎత్తుకోవాల్సివచ్చింది విజయచందర్.

తెర వెనక విశేషాలతో పుస్తక రచన

 ‘కరుణామయుడు’తీసి 35 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా  విజయచందర్ ‘నేను - నా కరుణామయుడు’ అనే పుస్తకం ప్రచురించారు. తన సినిమా ప్రస్థానాన్నీ, కరుణామయుడు నిర్మాణం వెనక జరిగిన ఎన్నో ఘట్టాలనూ సవివరంగా,  ఆసక్తికరంగా అక్షరబద్ధం చేశారు.  గుంటూరు ఏసుపాదం రచనా సహకారం అందించారు.

పుస్తకం చివర్లో ఈ చలనచిత్రం స్క్రీన్ ప్లే- సంభాషణలను అనుబంధంగా అందించారు.

దాదాపు ఎ 4 సైజులో 640 పేజీలున్న ఈ భారీ పుస్తకం ఖరీదైన కాయితంతో- రంగులపేజీలతో, ఫొటోలతో ముస్తాబైంది. 

దీని వెల- రూ.1250.  

సినీ సాహిత్యంపై తెలుగులో వచ్చిన పుస్తకాల ధరల్లో (ఇప్పటివరకూ ) ఇదే అత్యధికం!

పేపర్ క్వాలిటీ,  పుస్తకం సైజు, రంగుల బొమ్మల సంఖ్యా కొంచెం కొంచెం తగ్గించి...  పుస్తకాంశాల్లోని చర్విత చర్వణాలను పరిహరించివుంటే- మ్యాటర్ ను బోల్డ్ లో కాకుండా  మామూలు ఫాంట్ లో ఇచ్చివుంటే... ఈ పుస్తకం ధర చాలా తగ్గేది. 

ఈ చిత్రనిర్మాణంలో విజయచందర్ కు చేదోడు వాదోడుగా నిలిచిన ‘ప్రొడక్షన్ మేనేజర్’ సజ్జల చిట్టిబాబు గారి ప్రస్తావన ఈ పుస్తకం ఆద్యంతం కనిపిస్తుంది. 

ఈ పుస్తకం విడుదలకు ముందే ఆయన చనిపోయారు.

స్వీయానుభవాలను ఆసక్తిని పెంచుతూ వర్ణించి చెప్పుకుంటూ పోవటంతో పాటు  అక్కడక్కడా మెరుపుల్లాంటి వ్యాఖ్యానాలతో,  ఉపశీర్షికల విభజనతో తీర్చిదిద్దటం వల్ల ఇది ఓ  నవల మాదిరిగా తయారై పఠనీయత పెరిగింది.

సినిమా సంభాషణలకు సంబంధించిన  ‘భాషా చర్చ’ ఆసక్తికరంగా ఉంటుంది.

సంభాషణలను  క్రిస్టియన్ తెలుగులో రాస్తానని రచయిత మోదుకూరి జాన్సన్ పట్టుబట్టటం,  వ్యావహారిక తెలుగులోనే రాయాలని విజయచందర్ వాదించటం... దానిమీద వాద ప్రతివాదాలు జరిగి విజయచందర్ ‘టార్గెట్ ఆడియన్స్ ’ఎవరనే ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తి, చివరకు తన అభిప్రాయం నెగ్గించుకోవటం...

ఇవన్నీ బాగున్నాయి.

పలనాటి సీమ (మాచర్ల- భైరన్నపాడు) ను ఆర్ట్ డైరెక్టర్ దిలీప్ సింగ్, కో డైరెక్టర్ ఫాదర్ క్రిష్టఫర్ కొయిలోలు పాలస్తీనాగా మార్చివేయటం; షూటింగ్ జరిగినన్ని రోజులూ  భైరన్నపాడు గ్రామస్థులు పాలస్తీనా ప్రజల దుస్తులు వేసుకుని, ఇళ్ళల్లో, వీధుల్లో తమతమ పనిపాటులు చేసుకోవటం...

 ఇవన్నీ ముచ్చటగా అనిపిస్తాయి.
  
నాస్తికులూ Vs దైవభక్తులూ

ఈ పుస్తకం  రాసింది దైవంపై నమ్మకం ఉన్న వ్యక్తి కాబట్టి తనకెదురైన  ‘ఆధ్యాత్మిక అనుభవాల’నూ, ‘మహిమ’లనూ వివరించారు.

నాకు అలాంటివాటిపై నమ్మకం లేదు కాబట్టి వాటిని హేతువాద/ నాస్తిక కోణంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. 

 ప్రకృతి సూత్రాల ప్రకారం ‘మహిమలు’ అనేవి  అసంభవం. భౌతిక నియమాలకు  అతీతమైన  ‘శక్తులు’ ఉన్నాయని భావించటం శాస్త్రీయ దృక్పథం కాదు. 

నిన్న మొన్నటి సత్యసాయిబాబా ‘మహిమాన్విత శక్తుల’ను నమ్మిన  సూరి భగవంతం లాంటి శాస్త్రవేత్తలున్నారు. ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంటుంది?

అందుకే వందేళ్ళ కిందటి శిరిడీ సాయిబాబాకు ఆపాదించిన మహిమలను విశ్వసించేవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

ఇక  రెండు వేల సంవత్సరాలకు పూర్వం జీవించిన క్రీస్తుకు ‘తాకినంతనే స్వస్థతనొసగిన’ మహిమలున్నాయని నమ్మేవారు అసంఖ్యాకంగా ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు.

క్రీస్తు జీవితగాథ చిత్రనిర్మాణంలో  మహిమలు తన అనుభవానికి వచ్చాయని  విజయచందర్ నమ్మకంగా చెపుతున్నారు. - 

*  ‘ ప్రభు క్రీస్తు  సాహచర్యమూ, సాన్నిహిత్యమూ, ప్రభువుతో ముఖాముఖి సంభాషించే మహద్భాగ్యం’ తనకు ఈ చిత్ర నిర్మాణ సందర్భంగా కలిగాయని ఆయన ఈ పుస్తకంలో చెపుతారు. 

  *  ఓ గద్ద షూటింగ్ సమయానికి వచ్చి జనఘోషకు బెదరకుండా కెమెరాకు అందుబాటులో ఉండి,  చిత్రీకరణకు సహకరించటం.

*  వర్షం కురవబోతుంటే .. చిత్రీకరణకు అవరోధం కాకూడదని  ప్రార్థన చేసిన  తర్వాత అనూహ్యంగా వాన రాకడ ఆగిపోవటం.

  *  క్రీస్తుకు శిలువ వేసి మరణించిన సన్నివేశం సందర్భంగా పెనుగాలి వీచటం,  శిలువ ముందుకు  పడిపోబోతుంటే - దానికి వ్యతిరేక దిశలో  గాలి వీచి శిలువను నిలబెట్టటం.

ఇలాంటివి కొన్ని సంఘటనలు పుస్తకంలో రాశారు విజయచందర్.

ఇవి నిజంగా జరిగాయని  నిజాయతీగానే విశ్వసించి అలా రాశారని నమ్మవచ్చు.

మొదటిది వైయక్తిక మానసిక  అనుభవం.  దేవుడిపై గాఢమైన  విశ్వాసం ఉన్నవారు ఇలా అనుభూతి చెందటం సాధారణమే.

కానీ మిగిలినవాటి సంగతి?  

కెమెరా పరిధిలో గద్ద ఎగరటం,
కురవాల్సిన  వర్షం రాకపోవటం,
పెను గాలి పరస్పర వ్యతిరేక దిశల్లో  వీచటం...

ఇవన్నీ యాదృచ్ఛికాలని గ్రహించాలి.

ఈ చిత్ర నిర్మాణ బృందంలో ఎవరైనా హేతువాదులో, నాస్తికులో ఉండుంటే వారు ఇదే సంఘటనలకు ఇచ్చే అన్వయం నిశ్చయంగా వేరేగా ఉంటుంది. 

కలవరపరిచే  ఒక ముప్పు తొలగటం, అనుకోని అనుకూలత కలిసిరావటం.. నమ్మకమున్నవారికి దైవ మహిమలుగా తోచటం సహజమే!

చిక్కి శల్యం... పాత్రకి బలం

‘‘యేసుక్రీస్తు పాత్రను ధరిస్తున్న నాకు తన రూపురేఖలను ప్రసాదించడానికే క్రీస్తు ప్రభువు నన్నిలా కష్టాల కొలిమిలో పుటం వేసి ఉంటారనీ, నా శరీరం చిక్కి శల్యమయ్యేలా చేసివుంటారనీ’’ఆయన చెప్పుకొచ్చారు.  Blessing in disguise అంటారే ... అలా! 

ఏసు పాత్రకు శరీరం శుష్కించిపోవటం చాలా అవసరం. అది అప్రయత్నంగానే... సహజంగా సమకూరటం ఇక్కడ విశేషం.

ఆకారం సరిపోవటం ఒక్క అంశం మాత్రమే!

ఈ పాత్రకు ఎంపికైన దగ్గర్నుంచీ ఏసు వేష భాషలూ, నడకా, మాట తీరూ, హావభావాలూ, భావోద్వేగాలూ  ఎలా ఉండేవో అర్థం చేసుకోవటం కోసం విజయచందర్ చేసిన కృషిని కూడా ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. 

క్రీస్తు పాత్రను అర్థం చేసుకోవటం కోసం ఆయన ఫాదర్ బాలగర్ గారిని అడిగిన మూడు ప్రశ్నలు చాలా కీలకమైనవి.

1. ఏసు ఎప్పుడైనా నవ్వారా?
2. ఏసు ఎప్పుడైనా కన్నీరు కార్చారా?
3. ఏసుకు కోపం వచ్చిందా?  

సమాధానాలు తెలిస్తే  పాత్ర స్థూల స్వరూపం అవగతం కాగల సమగ్రమైన ప్రశ్నలివి! ఇలాంటి పాత్రలు ధరించాలంటే ఏ నటుడైనా పరిశీలించి, జవాబుల కోసం అన్వేషించాల్సిన ప్రశ్నలవి! 

అద్దంలో రాక్షసుడు

తొలిసారిగా క్రీస్తు మేకప్ తనకు  వేస్తున్నపుడు సిగరెట్ కాలుస్తూ అద్దంలో చూసుకుంటే క్రీస్తులాగా కాకుండా రాక్షసుడి రూపం కనపడటం.. దాంతో సిగరెట్ పారేసి అంతర్మధనంతో విలపించిన, క్రీస్తును ప్రార్థించిన ఘట్టం ఆకట్టుకుంటుంది. 

‘‘అద్దంలో నా ఆకారాన్ని చూసుకుని నేనే సిగ్గుపడ్డాను తండ్రీ. ఆ రూపంలో కరుణ లేదు, ఆ రూపంలో త్యాగం కనబడటం లేదు, ఆ రూపంలో ప్రేమ లేదు; నా రూపం నాకే వికృతంగా కనిపిస్తున్నది, నన్ను నిరాశతో కుంగదీస్తున్నది’  అంటూ ప్రార్థించాక అద్దంలో తనకే నమ్మశక్యం కాని మార్పుతో క్రీస్తు రూపం గోచరించిందని ఆయన అంటారు. 

పాత్ర పోషణలో  నిజమైన కళాకారుడి తపనకు ఇక్కడ అద్దం పట్టారు విజయచందర్.

ముఖకవళికల్లో ఇంత సమూలమైన మార్పు రావటానికి ‘హేతువు’ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను.

సిగరెట్ తాగటం అనేది పొగతాగేవాళ్ళకు అమిత హాయిని చేకూర్చే అలవాటు. ఆ సమయాల్లో వారిమొహాల్లో  కొంత నిర్లక్ష్యం, ధీమా ... ఇవన్నీ కనపడుతుంటాయి. పఫ్ తాగటంలో కొంత కసి కూడా ద్యోతకమవుతుంది. అలాంటపుడు ఆ మొహంలో ప్రతినాయక ఛాయలు కనపడటం సహజమే. 

పాత్రపై మమకారం ఉన్న విజయచందర్ కు.. అలాంటి పాత్ర ధారణ చేస్తున్నపుడు సిగరెట్ తాగటం తగదనే అపరాధ భావం  ఏమూలో ఉండివుంటుంది.

ఇవన్నీ కలిసి అద్దంలో తన మొహం రాక్షసంగా  కనపడివుండాలి.

ప్రార్థన ద్వారా  చేసిన పొరపాటుకు కన్ఫెస్ అవటం వల్ల- ఆ పశ్చాత్తాపం వల్ల- మనసు తేలికపడివుంటుంది. 

తేటపడిన మొహంలో క్రీస్తు పాత్రకు అవసరమైన లాలిత్యం, కారుణ్యం గోచరించటం సహజమే కదా?    


పేకాట డబ్బుతో సగం సినిమా నిర్మాణం

 సినిమా నిర్మాణానికి పడిన కష్టాలూ, పేకాట ఆడిన డబ్బుతో షూటింగ్ చేయటం.. ఇవన్నీ చాలాకాలం క్రితమే ఓ ఇంటర్వ్యూ లో విజయచందర్ చెప్పటం తెలుసు. అందుకే ఈ పుస్తకం వస్తోందంటే ఆసక్తిగా ఎదురుచూశాను. ( హైదరాబాద్ పుస్తకోత్సవంలో ఈ పుస్తక ధర చూసి, హతాశుణ్ణవటం వేరే సంగతి:)

మద్రాస్ ఆంధ్రాక్లబ్ లో నెలరోజుల పాటు విజయచందర్ జూదంలో గెలుస్తూనే ఉండటం, గెలిచిన ప్రతి రూపాయీ చిత్ర నిర్మాణానికే ఖర్చు పెట్టటం చెప్పుకోదగ్గ విషయాలు. ఏడెనిమిది రీళ్ళ సినిమా అంటే దాదాపు సగం సినిమాను పేకాటలో గెల్చుకున్న సొమ్ముతో తీయటం అరుదైన సంగతి. 

ఈ విశేష లబ్ధి కాకతాళీయం కాదు! 

ఎందుకంటే... ఆ క్రీడలో విజయచందర్ కు ‘నైపుణ్యం ’ ఉంది.

అయినప్పటికీ ప్రతిసారీ గెలవటం నిశ్చయంగా అసాధారణమే. కానీ  అసంభవం మాత్రం  కాదు. మా ఊళ్ళో ఒకాయన కేవలం పేకాట వల్లనే బాగా డబ్బు సంపాదించి , రాజకీయాల్లోకి వచ్చి ప్రెసిడెంట్ కూడా అయ్యాడు.  అయితే  ఈ జూదం వల్ల ఆస్తులు పోగొట్టుకున్నవాళ్ళే ఎక్కువమంది!

దర్శకుడి ఫొటో ఏదీ?

ఇంత పెద్ద పుస్తకంలో కొన్ని లోటుపాట్లు కనపడుతున్నాయి. చిత్రానికి పనిచేసిన సాంకేతిక సిబ్బంది ఫొటోలన్నీ ఇచ్చినా...

* డైరెక్టర్ భీమ్ సింగ్ గారి ఫొటో ఎక్కడా ఇవ్వలేదు. ఆయనను ఎలా ఎంపిక చేసుకున్నారన్న  వివరాలేమీ లేవు.

* సంగీత దర్శకులు జోసెఫ్ కృష్ణ, బి.గోపాలం; పాటలు రాసిన శ్రీశ్రీ, సినారె తదితరుల ఫొటోలు లేవు.

 * ‘రారాజు క్రీస్తు’ నిర్మాణ సంస్థ పేరు, దర్శకుడి పేరూ ప్రస్తావించలేదు.

*  ఈశ్వర్ గారి  పోస్టర్ డిజైనింగ్ గురించి ఎంతో రాసి కూడా, ఒక్క పోస్టర్ కూడా  ఇవ్వలేదు. అసలు ఈ సినిమా లోగో ఎలా ఉంటుందో చూపలేదు.

 పాటల పుస్తకం కవర్ పేజీ ఇక్కడ నేనిస్తున్నాను. ‘లోగో’ చూడండి! దీన్ని డిజైన్ చేసింది ఈశ్వర్ కాదు, బాచి.



ఈ  చిత్రాన్ని మత ప్రచారం కోసం తీయలేదని విజయచందర్ స్పష్టం చేస్తారు. ‘యేసుక్రీస్తు జీవితాన్ని యథాతథంగా తెరకెక్కించడమే నా ఉద్దేశం’ అంటారు. 

‘క్రీస్తు వేషం వేసేవాడు నామరూపాలు లేకుండా పోతాడు, అవమానాల పాలవుతాడు, మరణించినా మరణించవచ్చు’ అనే మూఢనమ్మకానికి ఎదురీది,  దాన్ని అబద్ధం చేశారు విజయచందర్!  

ఈ భక్తి  సినిమాలో నాస్తిక భావాలతో సాగే శ్రీశ్రీ పాట ఒకటుంది.   

మోదుకూరి జాన్సన్ రాసిన ‘కదిలిందీ కరుణ రథం’ పాట-  సంగీత సాహిత్యాల అద్భుత సమ్మేళనం-  కూడా  ఉంది.   

టపా విస్తరణ భీతితో ... వీటి గురించి ఏమీ రాయకుండా ఇంతటితో ముగించేస్తున్నా:) 

----------------------------------------------------

ఈ టపా గురించి రామ్ ప్రసాద్ గారి స్పందన-