సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, జూన్ 2013, మంగళవారం

పాము కాటేసింది... మనిషి మన్నించాడు!



ప్రతిరోజూ ఎన్నో వార్తలు చదువుతుంటాం.  అన్నీ గుర్తుండిపోవు; మనసును తాకలేవు.

కానీ  ఇవాళ  ఈనాడు  పత్రిక  హైదరాబాద్ సిటీ ఎడిషన్లో వచ్చిన ఓ వార్త... అసాధారణంగా అనిపించింది.  మరిచిపోతున్న మానవత్వపు పరిమళాన్ని గుర్తు చేసింది.
 
* * *

ఎవరికో  సాయం చేయడానికి వెళ్ళి పాముకాటుతో  చనిపోయాడు కొడుకు. ఆ కొడుకు ప్రాణం తీసిన పాము ఇంకా కళ్లముందే సజీవంగా ఉంది !

ఎవరైనా ఏం చేస్తారు?  కోపంతో చంపేస్తారు కదూ?!

కానీ అనంతరాములు అలా చేయలేదు.

చెట్టంత కొడుకు పోయిన గుండె కోత,  కొడుకు పోయిన దు:ఖంతో తన భార్య,  భర్తను కోల్పోయిన  కోడలి శోకం, మూడేళ్ళ మనవరాలు  తండ్రి గురించి అమాయకంగా తీస్తున్న ఆరా -  వీటిని దిగమింగేశారు.  

ఆ పాముకు ఎలాంటి అపకారమూ తలపెట్టలేదు. కొడుకు శవం ఇంకా ఇంటికి రానేలేదు.  పామును సంచిలో పెట్టుకుని  భద్రంగా అడవిలోకి తీసుకువెళ్ళారు. స్వేచ్ఛగా  వదిలేశారు! 

‘పాముల ద్వారా మనుషులకూ, మనుషుల ద్వారా  పాములకూ ఎలాంటి హానీ కలగకుండా చూస్తా’నని తన గురువుకు ఎప్పుడో ఇచ్చిన  వాగ్దానం ఇలా నెరవేర్చుకున్నారు !

ఆ పాము ఆత్మరక్షణకోసమే శ్రీనివాస్ ను  కాటేసివుంటుంది. నిజమే! అది తెలిసినప్పటికీ  పుత్రశోకం భరిస్తూనే -  చూస్తూ చూస్తూ ఆ పాముకు ప్రాణభిక్ష పెట్టటం మామూలు విషయమైతే కాదు. 

ఈనాడు హైదరాబాద్ సిటీ ఎడిషన్లో  వారం రోజుల క్రితం వచ్చిన వార్త,  దానికి ఫాలో అప్ గా ఇవాళ వచ్చిన వార్తా ఎవరి మనసులనైనా  ద్రవింపజేస్తాయి.  

* * *

మొదటి వార్తను  క్లుప్తం చేసి,  ఇక్కడ  రాస్తున్నాను. 

ఇవాళ  హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన రెండో వార్త ను  యథాతథంగా... ఇదే టపాలో పెట్టిన  scribd లో చూడండి. 

* * *

ది రోజుల క్రితం ...
ఆదివారం రాత్రి -

హైదరాబాద్  గండిమైసమ్మ చౌరస్తాలోని ప్లాస్టిక్ పరిశ్రమలోకి పాము వచ్చింది.  అక్కడివాళ్ళు వెంటనే దాన్ని  పట్టుకోవటం కోసం  మాదాసు అనంతరాములు అనే వ్యక్తికి కబురు పంపారు. జగద్గిరి గుట్ట దగ్గర్లోని దేవమ్మబస్తీ లో ఆయన నివసిస్తుంటారు.

ఇలా జనావాసాల్లోకి పాములు వస్తే వాటిని పట్టుకుని  ఊరికి దూరంగా వదిలివేసే పనిని ఆయన ఉచితంగా 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. 

ఫోన్ వచ్చిన సమయంలో అనంతరాములు  వేరే చోటికి వెళ్ళారు ఆయన. దీంతో ఆయన పెద్దకొడుకు శ్రీనివాస్ (32) కు ఫోన్ వెళ్ళింది.  తండ్రి బదులు తనే బయల్దేరి వెళ్ళారు శ్రీనివాస్. పామును పట్టుకున్నారు.

కానీ సంచిలో వేయబోతుండగా శ్రీనివాస్ ను పాము కాటేసింది. చేతివేళ్ళు పాము నోట్లో కరుచుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా విడిపించుకోవటం సాధ్యం కాలేదు.

చేతికి కరుచుకున్న పాముతోనే షాపూర్ నగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి వరకూ  వచ్చారు. అక్కడికి వచ్చిన మిత్రులూ, బంధువులూ ఎలాగో పాము కోరల నుంచి శ్రీనివాస్ ను విడదీశారు.

అప్పటికే - పాము విషం ఎక్కి,  అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీనివాస్ ప్రాణాలు విడిచారు!

* * *