సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, మార్చి 2016, గురువారం

పుస్తకాల్లోంచి పలకరించి .. వెంటాడిన పాట!

66 ఏళ్ళ నాటి సినిమా  ‘షావుకారు’. 

ఈ చిత్రం  వివరాలు కొన్ని   తెలుసు గానీ,   దాన్ని చూసే  సందర్భం,  ఆసక్తీ  రాలేదు.



కానీ దానిలోని ఓ పాట మాత్రం వరసగా నేను చదివిన రెండు పుస్తకాల్లోనూ కనపడి, ఆ పాట సంగతేమిటో పట్టించుకోకుండా ఉండలేని స్థితిని కల్పించింది.

మొదట చదివిన పుస్తకం - ‘చందమామ’ (విజయా ప్రొడక్షన్స్)  నాగిరెడ్డి గారి కొడుకు  విశ్వం రాసిన  ‘నాన్నతో నేను’.  దాని వెనక అట్ట మీద ఇలా ఉంది-

‘‘మారిపోవురా కాలము
మారుట దానికి సహజమురా’’ 

ఇది మా నాన్న గారు- చక్రపాణి గారితో కలిసి రూపొందించిన తొలి చిత్రం ‘షావుకారు’లోని ఓ పాటకు పల్లవి. ...

ఇలా ఆ పాటతో పుస్తకానికి అనుసంధానం చేస్తూ కొన్ని వివరాలు ఇచ్చారు.
....

ఓహో...అనుకున్నాను. ఆ పాట గురించి పెద్దగా పట్టించుకోలేదు.

 
‘దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!’ నవల రెండోది.  ఈ పుస్తకంలో అడుగడుగునా ఈ పాట ప్రస్తావన ఎన్నోసార్లు కనిపించింది.

చాలా సన్నివేశాలకు ఈ పాట భావాన్ని అన్వయిస్తూ రాశారు ఈ నవలా రచయిత్రి  రంగనాయకమ్మ

 ‘షావుకారు’ సినిమా పాటల పుస్తకంలోంచి ఆ పాట-




ఎవరికైనా  అవసరమయ్యే  ఆశావహ దృక్పథాన్ని తేలిక మాటల్లో  వ్యక్తం చేసిన పాట ఇది. ముఖ్యంగా కష్టాల్లో చిక్కుకుని, నిరాశతో మునిగినవారికి ఈ పాట ఎంతో ఊరటనిస్తుంది. 

ఇక ఈ పాట  ట్యూను ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించి, ఆడియో విన్నా. చాలా బాగుంది. అప్పట్నుంచీ ఆ పాట బాణీ తరచూ గుర్తొస్తూ నన్ను వెంటాడటం మొదలుపెట్టింది!

‘మారుట సహజమురా’ అని గాయకుడు పాడారు.
పాటల పుస్తకంలో ‘మారుటె సహజమురా’ అని ఉంది, చూశారా? 
పాటల రికార్డింగులో ‘మారుట’ అనే మాటే  పాడుకోవటానికి సౌకర్యంగా బాగుంటుందని మార్చివుంటారు.

‘ఉదయాస్తములూ’ అనే మాట చూడగానే దానిలో ఏదో తప్పుందని అనిపించింది. కానీ సాహిత్యం అలాగే ఉంది, పాటలోనూ అలాగే ఉంది.

 ‘ఉదయాస్తమయాలూ’  అని ఉండాలి  కదా అనే సందేహం నాకింకా అలాగే ఉంది.

( ఈ  సందేహం తీరింది.  నిఘంటువులో చూస్తే   ‘అస్తం’ అనే మాట ఉంది. అస్తాద్రి అనే మాట పుస్తకాల్లో కనపడుతుంది కూడా.   అస్తం అనే పదానికి  - సూర్యుడు అస్తమించే కొండ,  కుంకటం, కనపడకపోవటం అనే అర్థాలున్నాయి. కాబట్టి  అస్తములూ  అనే మాట  సరైనదే.  పాడటానికి కూడా అనుకూలంగా ఉందీ మాట..)  


ఈ పాట ఒక  రోజు రాత్రి విన్నాను.

తర్వాతి రోజు పొద్దున్నే ఆ పాటను నా మెయిల్లోకి పంపుకుని, మొబైల్లో  ఓపెన్ చేశాను.  ఆ పాటను రంగనాయకమ్మ గారు వినాలని వాట్సాప్ లో పంపించేశాను. (ఆ పాట ఆమెకు ఎంత సుపరిచితమైనా , దాన్ని విని ఎంతకాలమైందో తెలియదు కదా.. మరోసారి వినాలని.. )

 ఇప్పుడే పాట విన్నాం.  రాసిన పాట, కట్టిన బాణీ,  పాడిన తీరు..  అన్నీ బాగున్నాయి. మంచి పని చేశారు, అందరూ కలిసి-  అని  సమాధానం వచ్చింది! 

ఈ సాట పాడినవారు మాధవపెద్ది సత్యం. రాసింది సముద్రాల. సంగీత దర్శకత్వం- ఘంటసాల. 



ఈ పాట చిత్రీకరణ ఎలా ఉంటుంది?  ఈ ఆసక్తి ఏర్పడింది. 

యూట్యూబ్ లో చూశాను.

దీని సినిమాటోగ్రఫీ  ‘మాయాబజార్’ ఫేమ్ మార్కస్ బార్ట్లే ది.  చక్కని పల్లెటూరి, ప్రకృతి దృశ్యాలను  ఈ పాటలో చూడొచ్చు. (షావుకారు సినిమా తర్వాతే  మాయాబజార్ ని తీశారనుకోండీ..)



వల సంగతేమిటి?

మాతృదేవోభవ,  పితృదేవోభవ ... అనే మాటలు  తరతరాలుగా  వింటూవస్తున్న మనకు ‘దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!’ అన్న నవల  పేరు చప్పున మింగుడుపడదు.

పిల్లలను  ప్రేమగా పెంచే తల్లిదండ్రులు  దేవుళ్ళయితే, వాళ్ళను హింసించే తల్లిదండ్రులు మనుషులు కాకపోగా, క్రూర  రాక్షసులే అవుతారు కదా?    


 
 ఈ రచనకు ప్రధాన ఆధారం  ఒక పాఠకురాలి జీవితంలో జరిగిన చేదు అనుభవాలు.  కొన్ని ఇతర కల్పిత పాత్రలు సృష్టించి, కథాగమనానికి అవసరమైన మార్పులూ చేర్పులూ  జోడించానని రచయిత్రి పుస్తకంలో  ‘చివరి మాట’లో రాశారు.  

ఈ నవల సీరియల్ గా  ‘నవ్య’ వారపత్రికలో వచ్చింది. అప్పుడు లేని,  వేరే సంఘటనలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.

సీరియల్ నాటికన్నా ఇందులో కొత్త చేర్పులు  దాదాపు 40 పేజీలవరకూ ఉన్నాయి. 
 
తాజా  చేర్పు :  ఈనాడు ఆదివారం అనుబంధంలో  ఏప్రిల్ 4న వచ్చిన రివ్యూ ఇది...



ఈ నవల్లో కథానాయిక పార్వతి.  ఆమెపై ఆమె చెల్లెలు సరస్వతిపై వాళ్ళ తల్లిదండ్రుల  వేధింపులూ, దౌర్జన్యాలూ చదువుతుంటే ఒకపట్టాన నమ్మబుద్ధి కాలేదు.

కన్నబిడ్డలపై ఎవరైనా ఇంత హేయంగా,  నిర్దయగా ప్రవర్తిస్తారా? ఇంత కాఠిన్యం చూపుతారా? కనీసమైన జాలినైనా  ప్రదర్శించరా?... ఇవీ నా సందేహాలు... 

కానీ అవన్నీ వాస్తవంగా జరిగినవే.

సీరియల్ గా వచ్చినపుడు ఈ నవల్లోని   బొమ్మలు ...
 
అంతే కాదు;  ఈ నవల ‘నవ్య’లో సీరియల్ గా వస్తున్నపుడు మరికొందరు ఘోరమైన తమ చేదు అనుభవాలను రచయిత్రితో పంచుకున్నారు.

పిల్లలపై  తల్లిదండ్రుల వేధింపుల సవివర వర్ణన.. అప్పటికి వాటిపై  నాకున్న సందేహాలవల్లనేమో,  కొంత విసుగు పుట్టింది.

కానీ తర్వాత కథాగమనం వేగంగానే నడిచింది.

ముఖ్యంగా పార్వతి పెద్దయ్యాక  తల్లిదండ్రులతో చేసే సంభాషణలు అద్భుతం.  నవల్లోని అలాంటి  ఘట్టాల్లో ప్రత్యేకంగా రచయిత్రి కలం కదం తొక్కింది.

ఓ చోట చూడండి-
 
‘‘నాన్నగారా? ఎవరు ఆయన? అసలు నేనెవర్ని మీకు? మీ కొంపలో నించి నేను కాలు బైటపెట్టి నాలుగేళ్ళయింది! కూతుర్ని చచ్చినదానితో  జమకట్టారు! ఇంకా ‘కూతురి’గా నేనెక్కడున్నాను మీకు? ..’’
...  ....  ..... 


‘‘నాన్న గారికి పక్షవాతం వొచ్చిపడితే కూడా కోపంగా మాట్లాడతావా?’’


‘‘‘నాన్నగారికి’ పక్షవాతం ఇప్పుడొచ్చి పడిందేమో గానీ, మొదటినించీ వుంది పక్షవాతం! ఆడపిల్లల్ని అనాథాశ్రమాల్లోకి గెంటెయ్యాలని చూశాడు నాన్నగారు; పెద్దదాన్ని చేరిస్తే ఫర్వాలేదని సలహా ఇచ్చారు అమ్మగారు. ఆ పక్షవాతాలకి వైద్యాలు చేయించుకున్నారా?’’


***

మరో చోట పార్వతి తన అత్త కొడుకుతో మాట్లాడే ఘట్టం...

‘‘పసితనం నించీ, ఉగ్గుపాల నించీ, అవమానాల అగాధంలో కూరుకుపోయి కమిలిపోయిన మనిషిని నేను. కన్న తల్లిదండ్రుల కౌగిళ్ళలో పువ్వులాగ పెరిగిన మనిషివి నువ్వు!’’


*** 

408 పేజీల ఈ నవల చదివాక  నాయనమ్మ, సావిత్రి, సుబ్బన్న, వంజాక్షి,  పార్వతి, మూర్తి,  సరస్వతి,  దాసు, శంకర్రావు, సత్య.. ఈ పాత్రలన్నీ  పాఠకుల్ని ఒకపట్టాన వదిలిపెట్టవు.

కాలక్షేపం కోసం చదివే పుస్తకమేమీ కాదిది.
అలా అని  విషాదంలో ముంచెత్తే  రచన కూడా కాదు.

 ‘మన చుట్టూ  ఇలాంటి జీవితాలు కూడా ఉన్నాయి’ అనే స్పృహను కలిగించే, ఆశావాదాన్ని నింపే నవల. 

పుట్టింటి నరకం నుంచి బయటపడటానికి తనకు పెళ్ళి జరగాలని కోరుకుంటుంది పార్వతి. కానీ అత్తింటికి వెళ్ళటం ‘పెనం లోంచి పొయ్యిలోకి పడ్డ’ట్టు అయింది.  కానీ కాలం మారిపోతుంది. ఆమె జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి.

తన బతుకు బాగుపడితే చాలనే చిన్న పరిధిని దాటిపోయి, సమాజం మొత్తం సమూలంగా బాగుపడాలని కోరుకునే మనిషిగా ఆమెలో పరిణతి వస్తుంది.

‘తల్లిదండ్రుల మీద ద్వేషం పుట్టించడానికి రాసిన నవల ’ అంటూ కొన్ని విమర్శలు ఈ నవలపై వచ్చాయట. కానీ -

‘కీర్తి’కోసం, ధనం కోసం ప్రమాదకరమైన పర్వతారోహణలకు  పిల్లలను ప్రోత్సహించేవారి గురించీ, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని కొడుకులనూ, కూతుళ్ళనూ పరువు హత్యలతో మట్టుబెట్టే వారి గురించీ తరచూ వార్తల్లో చదువుతూనే వున్నాం, టీవీల్లో చూస్తూనే వున్నాం కదా?  మరి వీరు కూడా తల్లిదండ్రులే కదా?   

అందుకే ఈ నవల.. పెద్దగా మనం ఆలోచించని, పట్టించుకోని కోణాన్ని మనకు చూపేట్టే సమకాలీన రచన!